Operation Sindhur: భారత్ దాడులతో పాకిస్థాన్‌లో రెడ్ అలర్ట్

Read Time:  1 min
Operation Sindhur: భారత్ దాడులతో పాకిస్థాన్‌లో రెడ్ అలర్ట్
FONT SIZE
GET APP

భారత వైమానిక దాడుల దెబ్బతో పాకిస్థాన్ లో ఉద్రిక్త పరిస్థితులు

భారత వాయుసేన మంగళవారం రాత్రి చేపట్టిన సర్జికల్ దాడులు పాకిస్థాన్‌ను కుదిపేశాయి. ఈ దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా దాడులు జరిపినట్లు సమాచారం. దీంతో పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన పాకిస్థాన్ ప్రభుత్వం, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం, పోలీస్, వైద్య వ్యవస్థల్ని అప్రమత్తం చేసింది. ఇస్లామాబాద్‌తో పాటు దక్షిణ పంజాబ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇదే క్రమంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరికొన్ని గంటల్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దేశ భద్రతా పరిస్థితిపై ప్రజలకు వివరించడంతో పాటు, భారత దాడులకు ప్రతిస్పందనగా భవిష్యత్ కార్యాచరణపై ఆయన స్పష్టత ఇవ్వనున్నారు.

pakistan prime minister

సర్జికల్ స్ట్రైక్స్ లక్ష్యం: ఉగ్రవాద సంస్థల రహస్య స్థావరాలు

పాకిస్థాన్ సైన్యం ప్రతినిధి ఐఎస్‌పీఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రకారం, ఈ దాడుల్లో కనీసం 26 మంది మరణించగా, 46 మందికి పైగా గాయపడ్డారు. దాడులు పాకిస్థాన్ లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. వీటిలో అత్యంత ప్రాధాన్యత కలిగినవి – బహవల్‌పూర్ లోని అహ్మద్‌పూర్ షర్కియా, మురీడ్‌కే, ముజఫరాబాద్, కోట్లి, బాగ్ పట్టణాలు.

అహ్మద్‌పూర్ షర్కియాలో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్‌కు చెందిన రహస్య స్థావరంపై దాడి జరిగినట్లు వర్గాలు తెలిపాయి. ఇదే విధంగా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు చెందిన మురీడ్‌కేలోని ప్రధాన కార్యాలయం లక్ష్యంగా మారింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్, కోట్లి, బాగ్ ప్రాంతాల్లో కూడా ఉగ్రవాద సంస్థల శిబిరాలపై దాడులు జరిగాయి.

ఆసుపత్రులు, విద్యాసంస్థలు, విమాన సర్వీసులు నిలిపివేత

ఈ సంఘటనల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను కనీసం 24-36 గంటల పాటు నిలిపివేయాలని పాక్ పౌర విమానయాన సంస్థ ప్రకటించింది. పంజాబ్ ప్రావిన్స్‌తో పాటు ఇస్లామాబాద్‌లోని అన్ని విద్యాసంస్థలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు. భద్రతా దృష్ట్యా ప్రజలను అవసరమైతే ఇంట్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

జాతీయ భద్రతా కమిటీ అత్యవసర సమావేశం

ఈ పరిణామాల నేపథ్యంలో, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన నివాసంలో జాతీయ భద్రతా కమిటీ (NSC) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భద్రతా రంగాధికారులు, మిలిటరీ చీఫ్‌లు, ఇంటలిజెన్స్ అధికారులు పాల్గొననున్నారు. భారత వైమానిక దాడులకు రాజకీయ, వ్యూహాత్మక ప్రతిస్పందనపై చర్చించే అవకాశముంది. భారత్‌తో ఒత్తిడి తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో, పాకిస్థాన్ వాణిజ్య కేంద్రాల వద్ద సైనిక శక్తిని కేంద్రీకరిస్తోంది.

ప్రత్యర్థుల ఉగ్రవాద స్థావరాలపై భారత్ మళ్లీ దాడి చేయడం పాక్ అంతర్గత రాజకీయం, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Read also: India Pakistan War: మోర్టార్ షెల్స్‌తో సాధారణ పౌరులపై పాక్ దుశ్చర్యలు

Ramya

రచయిత గురించి

Ramya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.