గంగా సంగమం జరిగే ప్రదేశం అస్సీ ఘాట్
కాశీ : మహాశివరాత్రి వేళ వారణాసిలో ఘాట్ లు అన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. కుంభమేళాకు వెళ్ళిన భక్తులు అట్నుంచి ఆటే వారణాసికి వెళ్లి వస్తున్నారు. అయితే తెలుగు వాళ్ళకి పెద్దగా పరిచయం లేని ముఖ్యమైన ఘాట్ ఒకటి కాశీలో ఉంది. నార్త్ లో ఇది చాలా పెద్ద ఫేమస్. ప్రయాగ తరహాలో ఇక్కడ కూడా నదీ సంగమం జరుగుతుంది. అదే “అస్సి ” ఘాట్.

వరుణ -అస్సీ ల కలయికే వారణాసి
కాశీకి వారణాసి అనే పేరు కూడా ఉందని అందరికీ తెలుసు కదా. అయితే ఆ పేరు రావడానికి కారణం వరుణ -అస్సి అనే నదులు. ఈ రెండు నదుల పేర్లు మీద కాశీకి వారణాసి అనే పేరు ఏర్పడింది. ఈ రెండిట్లో అస్సి నది పేరు పద్మా,మత్స్య,అగ్ని, కూర్మ పురాణాల్లో కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ అస్సీ నది పవిత్ర గంగా నదితో కలిసే ప్రాంతంలో అస్సి ఘాట్ ఉంటుంది. ఇక్కడ రెండు నదుల సంగమాన్ని చూడొచ్చు. ఘాట్లు అన్నింటిలోనూ దక్షిణం వైపున చివర ఉండే ఘాట్ కావడం తో రిటైర్డ్ ప్రొఫెసర్లు స్టూడెంట్స్ సహా కాశీ నగర వాసులంతా ఉదయం సాయంత్రం వచ్చి ఈ ఘాటు వద్ద కూర్చుంటారు.
మొత్తం ఘాట్లన్నీ ఒక వరుసలో రాజసంగా కనిపిస్తాయి
ఇక్కడ నుంచి గంగానదిని చూడడం అదో అద్భుతమైన అనుభూతి. సగటున 22,500 మంది పర్యాటకులు భక్తులు ఈ ఘాట్ ను రోజు సందర్శిస్తారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడికి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఇక్కడి నుంచి చూస్తే మొత్తం ఘాట్లన్నీ ఒక వరుసలో రాజసంగా కనిపించడం దీనికి కారణం. తన జీవితాంతం కాశీలోని తులసి ఘాట్లో కాలం గడిపిన తులసీదాస్ తన ప్రాణాన్ని వదిలింది మాత్రం ఎస్సీ ఘాట్ లోనే అని ఆయన శిష్యులు చెబుతుంటారు.