దేశంలో జమిలి ఎన్నికలపై చర్చలు మళ్లీ వేగం పెంచుతున్నాయి అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే ప్రయోజనాలు విపరీతం అని అన్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే దేశ జీడీపీ 1.5 శాతం పెరుగుతుందని వివరించారు. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి జమిలి ఎన్నికలు ఉండవని స్పష్టం చేశారు.2024 ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేసిందని గుర్తు చేశారు.

జమిలి ఎన్నికలు జరిగితే ఇదంతా ఆదా అవుతుందని చెప్పారు.జమిలి ఎన్నికల వల్ల రూ.4.5 లక్షల కోట్లు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.ఇది ఎంత పెద్ద ప్రయోజనం అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని సూచించారు.ఆయన వ్యాఖ్యలతో జమిలి ఎన్నికల చర్చ మళ్లీ ఊపందుకుంది. కొన్ని పార్టీలు ఈ అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.“ఇది మోదీ తీసుకొచ్చిన పాయింట్ కాదు. ఇప్పటికే 1960ల నుండి దీనిపై చర్చ జరుగుతోంది” అని చెప్పారు.ప్రస్తుతం జమిలికి పునాది మాత్రమే వేస్తున్నామని, 2034 తర్వాతే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటి చర్యలు భవిష్యత్తుకు బలమైన అడుగులుగా నిలవబోతున్నాయని స్పష్టం చేశారు.జమిలిని అర్థం చేసుకోకుండానే వ్యతిరేకించడం తప్పు అని అన్నారు. దీని వల్ల దేశానికి మెరుగైన పాలన సాధ్యమవుతుందని చెప్పారు.కరుణానిధి గతంలో జమిలికి మద్దతిచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆయన కుమారుడు స్టాలిన్ దీనిని వ్యతిరేకిస్తుండటం విచారకరమన్నారు.ఈ మాటలన్నీ చూస్తే… భవిష్యత్తులో జమిలి ఎన్నికలు సాక్షాత్కారమే అన్న విషయం స్పష్టమవుతోంది.