NIA : ముంబై 26/11 ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులో ఉన్నాడు. ముంబై దాడులకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్ఐఏ, అతడి వాయిస్ శాంపిల్ను సేకరించే చర్యలు ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. ముంబైలో 166 మంది ప్రాణాలను బలిగొన్న దాడులకు సంబంధించి ఆ సమయంలో ఇతరులకు తహవూర్ రాణా సూచనలు ఇస్తున్నట్టు అనుమానిస్తున్న కాల్ రికార్డులతో వాయిస్ శాంపిల్ను సరిపోల్చి చూడనున్నారు. అయితే, ఈ ప్రక్రియ కోసం వాయిస్ శాంపిల్ సేకరించాలంటే నిందితుడి అనుమతి కూడా ఉండాలి. అతను వద్దనుకుంటే అధికారులు న్యాయస్థానం నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి తర్వాతే అతడి వాయిస్ను రికార్డు చేస్తారు. వాయిస్ శాంపిల్కు అతడు నిరాకరిస్తే విచారణ దశలో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.

రాణాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు
కాగా, ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో రాణాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు ముంబై ముట్టడి ప్రారంభం కావడానికి ముందు అతడు దుబాయ్లో కలిసిన వ్యక్తి పాత్రను, అతడి ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీగా నమోదైన ముంబైలోని ఆఫీసు లీజును పునరుద్ధరించకపోవడం గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఆఫీసుని 26/11 దాడుల సూత్రధారి డేవిడ్ హెడ్లీ నగరంలోని కీలకమైన హోటళ్లు, పబ్లిక్ సైట్లతో సహా అనుకున్న లక్ష్య ప్రదేశాలపై నిఘా ఉంచడానికి ఒక కవర్గా ఉపయోగించినట్లు సమాచారం. అలాగే, ముంబై దాడులకు ప్రధాన కుట్రదారులు సాజిద్ మజీద్, జకీర్ రెహమాన్ లఖ్వి, అబుద్ల్ రెహమాన్, ఇలియాస్ల గురించి అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొలిరోజు విచారణలో తనకేమీ గుర్తులేదని, దాడులు జరిగేందుకు వారం ముందు మాత్రమే వచ్చినట్టు నిందితుడు చెప్పాడని సమాచారం.