ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సేవలు అందిస్తోన్న సేవకులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. శ్రీవారి సేవలకు వ్యవస్థ, వారి పనితీరుపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలు- ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల నుంచి శ్రీవారికి సేవ చేయడానికి సేవకులు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో తిరుమల వస్తున్నారని, వారందరికి ప్రణాళికా బద్ధంగా శిక్షణ ఇవ్వాలని అన్నారు. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.మెడికల్, ఇంజినీరింగ్, ఐటీ, క్యాటరింగ్, కల్చరల్, గోసేవ తదితర రంగాల నుండి నిపుణులను శ్రీవారి సేవలో భాగస్వామ్యం చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు.శ్రీవారికి సేవ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా ఐటీ అప్లికేషన్లో అవసరమైన మార్పులు చేయాలని ఈవో ఆదేశించారు.శ్రీవారి సేవపై శిక్షణ కోసం పుట్టపర్తి, ఈశా పౌండేషన్, ఆర్ట్ ఆప్ లివింగ్ తదితర సంస్థల నుండి ఇప్పటికే అభిప్రాయాలను సేకరించామని, సదరు నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించాలని సూచించారు. శిక్షణలో మెడిటేషన్, యోగా, నైపుణ్యాభివృద్ధి, వైద్య సేవలు, సామర్థ్యాల పెంపు, అభిప్రాయ సేకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే శిక్షణ తీసుకున్న సీనియర్ శ్రీవారి సేవకులను మాస్టర్ ట్రైనర్స్గా తీర్చిదిద్దాలని ఈవో సూచించారు. శ్రీవారి మహాత్యం, తిరుమల ప్రాముఖ్యత, శ్రీవారి సేవ విధి, విధానాలు, సేవా నిరతి, మరింత నాణ్యమైన సేవలు, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.
గ్రూప్ లీడర్ల
మాస్టర్ ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రారంభంలో ఏపీలోని 26 జిల్లాల నుండి గ్రూప్ లీడర్లను ఎంపిక చేస్తామని, తదుపరి దశల్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు గ్రూప్ లీడర్లను ఎంపిక ఉంటుందని చెప్పారు. ఈ శిక్షణ మాడ్యూల్లో తిరుమల ప్రాముఖ్యతను శ్రీవారి సేవకులకు వివరించడం, శ్రీవారి సేవలో పాల్గొన్నప్పుడు వాళ్లు చేయవలసినవి, చేయకూడనవి, భక్తులకు అంకితభావంతో ఎలా సేవ చేయడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం, నైతిక విలువలను అలవర్చుకోవడం, ఇతర అంశాలు ఉంటాయని ఈఓ తెలిపారు.

అభిషేకం
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. మే 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయంలో ఊంజల్సేవ జరుగనుంది. మే 2న ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ. మే 3న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పుష్పయాగం. మే 12వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల ఊరేగి దర్శనం ఇవ్వనున్నారు. మే 18న అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 8 గంటలకు శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం. మే 22న హనుమజయంతి సందర్భంగా రాత్రి 7 గంటలకు హనుమంత వాహనం. మే 27న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది. మే 30వ తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.
Read Also: Pakistanis : పాకిస్థానీలు రేపటిలోగా వెళ్లిపోవాలి – ఏపీ డీజీపీ