కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం బనకచర్ల అనుసంధానానికి లెక్కలేనన్ని అవరోధాలు (Obstacles)ఎదురైనవి. ఈ పథకం చేపట్టే సమయంలోనే రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులకు ముందు చూపు లేకపోవడం ఒకటైతే తెలంగాణ అభ్యంతరాలకన్నా కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం ప్రధాన కారణంగావుంది. ఫలితంగా బనకచర్ల (Banakacharla )అనుసంధాన ప్రతిపాదన ప్రతిష్టంభనలో పడటమే కాకుండా రాయలసీమ తదితర మెట్ట (ప్రాంతాలను పరోక్షంగా ఆదుకొనేందుకు 201419 లో చంద్రబాబు నాయుడు ప్రతి పాదించిన గోదావరి పెన్నా అనుసంధానం కూడా చిక్కుల్లో పడింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించునట్లుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నుండి తరలించే 80 టియంసిలకు ఈ పథకాన్ని పరిమితం చేస్తే అంతర్ రాష్ట్ర జల వివాదాలు గాని అపెక్స్ కౌన్సిల్ ఆమోదం గాని అవసరముండదు. వాస్తవంలో బనకచర్ల (Banakacharla ) అనుసంధానం పథకం జగన్మోహన్ రెడ్డి ‘హయాంలోనే పురుడు పోసుకున్నా అప్పట్లో సాగునీటి రంగం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో లేకపోవడంతో మరుగున పడి వుండి పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలో కొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దస్త్రాన్ని దుమ్ము దులిపి తలకెత్తుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంకు నేటికీ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలు పూర్తిగా మారి పోవడం తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ప్రతి పక్షం కావడంతో బనకచర్ల (Banakacharla )అనుసంధానం పెను వివాదమైంది.ఇంతకీ కూటమి ప్రభుత్వం బనకచర్ల అనుసంధానం తలపెట్టిన సమయంలో మున్ముందు ఎదురయ్యే సాంకేతిక క్లిష్టపరిస్థితులను రాష్ట్ర ఇంజనీరింగ్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించ వలసి వుండాలి. ఇంజనీరింగ్ అధికారులు .ముఖ్యమంత్రికి నివేదించ లేదో లేక వివరించి చెబితే ముఖ్యమంత్రి పెడ చెవిన బెట్టారో తెలియదు. ప్రప్రధమంగా గోదావరి అంతర్ రాష్ట్ర నది. దానిపై కొత్తగా ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నా ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత వైతరణీ నది లాగా రాష్ట్ర విభజన చట్టం ముందుకు వస్తుంది. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 84 మేరకు కృష్ణ గోదావరి నదులపై ఇరు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టాలంటే అపెక్స్ కౌన్సిల్ విధిగా ఆమోదించాలి. మరి తెలంగాణ లో కెసిఆర్ ఏం చేశారు?ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన అనుమతులు పొందిన పథకాలను రీ డిజైన్ పేరుతో తన పని నిరాఘాటంగా సాగించారు. మూడు పథకాలు రద్దు చేసి సీతారామ ఎత్తిపోతలు ప్రాణహిత చేవెళ్ల బదులు కాళేశ్వరం ఇలా చాలా పథకాలను కెసిఆర్చే పట్టారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డిని మచ్చిక చేసుకోవడంతో ఆంధ్ర ప్రదేశ్ వేపు నుండి అడ్డే లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే దేశంలో ఇంత వరకు వరద జలాలతో కేంద్ర జల సంఘం ఒక్క ప్రాజెక్టు అందులో భారీ సాగునీటి ప్రాజెక్టుఆమోదించిన సందర్భం లేదనే అంశం మన ఇంజనీరింగ్ అధికారులకు తెలియదని భావించ గలమా? ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచర్ల అనుసంధానం కోసం ఏమైనా మాట్లాడవచ్చు.

గోదావరిలో ఎవరి వాటా ఎంతో తేలకుండా వివాద పడుతున్న సమయంలో బనకచర్ల అనుసంధానం కోసం మీరెన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండని తెలంగాణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా వుంది..మరో అంశమేమంటే 201419 మధ్య కాలంలో టిడిపి ప్రభుత్వం తెలంగాణ 240 టియంసిలను గోదావరిబేసిన్ నుండి కృష్ణ బేసిన్ కు తరలించుతోందని గోదావరి యాజమాన్యం బోర్డు సమావేశాల్లో పలు మార్లు ఫిర్యాదు చేసింది . ఈ ఫిర్యాదు కేంద్ర జల సంఘం వరకు అప్పట్లో వెళ్లింది. తమాషా ఏమంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రాగానే ఈ ఫిర్యాదులు గాలికి పోయాయి. తదుపరి గోదావరి బోర్డు సమావేశంలో మన అధికారులు మోనం పాటించారు. నేడు బనకచర్ల అనుసంధానం అటకెక్కడానికి మన ఇంజనీరింగ్అధికారులు నిరక్ష్యానికి తెలంగాణ బద్ద వ్యతిరేకత తోడైనది. వీటికి తోడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేయవలసినదంతా చేసి తన చేతులకు మట్టి అంట విధంగా వ్యవహరిస్తోంది. బనకచర్ల అనుసంధానం యెడలతెలంగాణలో అధికార ప్రతి పక్షాలు ఒక్కుమ్మిడిగా వ్యతిరేకిస్తున్నందున ఒక వేళ ఆంధ్ర ప్రదేశ్ వేపు మొగ్గు చూపితే తెలంగాణలో రాజకీయంగా నష్టం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తటస్థత వహిస్తోంది. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే గాక వచ్చే శాసన సభ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ పార్టీలు బదనాం చేయ వచ్చనే భయం కేంద్ర ప్రభుత్వానికి పట్టుకొంది. అంత వరకే ఆగ కుండా కేంద్ర పర్యాటక శాఖతో సహా కేంద్ర జల శక్తి శాఖ అధీనంలో గల కేంద్ర జల సంఘం గోదావరి కృష్ణ యాజమాన్య బోర్డులతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీలు అడ్డంగా కొర్రీలు వేశాయి. ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వ సంస్థలు వేసిన కొర్రీలే తెలంగాణలోని అధికార ప్రతి పక్షాలకు బనకచర్ల అనుసంధానానికి వ్యతిరేకంగా బ్రహ్మాస్త్రాలుగా ఉంటున్నాయి. వాస్తవంలో జరిగింది వేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితి ఏర్పడుతుందని ఊహించి ఉండరు. . ముందుగా పర్యావరణ అనుమతులు సులభంగా లభిస్తాయని కేంద్రంలో అడ్డు వుండదని భావించారు. ఒక దశలో బనకచర్ల అనుసంధానం నిర్మాణం చేపట్టే కాంట్రాక్టు సంస్థకే కేంద్రం నుండి అనుమతులు పొందే బాధ్యత అప్పగిస్తామని కూడా ముఖ్యమంత్రి
ప్రకటించారు. కేంద్రంలో తనకు అడ్డు వుండదని ముఖ్యమంత్రి భావించినట్లుంది. బహుశా రాష్ట్ర ఇంజనీరింగ్
అధికారులు కూడా సాంకేతిక ఇబ్బందులతో కేంద్రం నుండి అనుమతులు రావని భావించినా అంతా
ముఖ్యమంత్రి పలుకు బడితో నెట్టుకు వస్తారని భావించి అంతర్ రాష్ట్ర జల వివాదాలను విస్మరించారు.

కేంద్ర జల సంఘం వేసిన కొర్రీలు అంత సులభంగా పరిష్కరించే పరిస్థితి లేదు. గోదావరి బేసిన్ లోని అన్ని
రాష్ట్రాల్లో నిర్మాణంలో వున్న లేక ప్రతి పాదనలో వున్న ప్రాజెక్టుల అవసరాలకు 75 శాతం డిపెండబిలిటితో
అవసరం తీరిన తరువాత మిగిలే వరద జలాలను లెక్కించడమే కాకుండా 75 శాతం డిపెండబిలిటితో
గణాంకాలను సమర్పించమని కోరింది . ఇది నిజంగానే యక్ష ప్రశ్నే. కృష్ణ నదిలో నికర మిగులు వరద
జలాలంటూ వర్గీకరణ జరిగింది. కాని గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో ఎట్టి వర్గీకరణ లేదు. అందు వలననే
వరద జలాలంటూ వుంటే అన్ని రాష్ట్రాలు తమకు వాటా వుందని డిమాండ్ చేస్తున్నాయి. ఇదొక చిక్కుగా
మిగిలింది. ఇదిలా ఉండగా కృష్ణ గోదావరి యాజమాన్యం బోర్డులు గోదావరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు
గోదావరి నుండి 80 టియంసిలకు మించి తరలించితే ఆ రేషియోలో ఎగువ రాష్ట్రాలకు కృష్ణ జలాలను
ఇవ్వ వలసి వస్తుందని బాంబ్ పేల్చాయ్. అంతిమంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ అసలు ఇప్పట్లో ఈ
పథకం గురించి మాట్లాడటం కుదరదని 45.72 మీటర్లు ఎత్తుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన
తర్వాతనే ఆలోచన చేయాలంటూ అప్పుడు కూడా ఈ పథకం అమలు చేయాలంటే పోలవరం ప్రాజెక్టు
ఆపరేషన్ షెడ్యూల్ మార్చ వలసి ఉంటుందని తేల్చి వేసింది. ఇన్ని అననుకూల పరిస్థితులు ఏర్పడినందుననే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా బనకచర్ల అనుసంధానం గురించి హడావుడి చేయడం లేదు.
-వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు
బనకచర్ల ప్రాజెక్టు వివరాలు?
గోదావరి బేసిన్ నుండి నదీ జలాలను పెన్నా బేసిన్కు తరలించే ఈ ప్రాజెక్టు ద్వారా, గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు రెండు టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను తరలిస్తారు. పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలోకి, అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి నల్లమల అభయారణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలిస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు లభిస్తుంది. 7.41 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పడుతుంది. 22.59 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుందని, పారిశ్రామిక అవసరాలకు 20 టీఎంసీల నీరు లభిస్తుందనీ ప్రభుత్వం అంచనా వేసింది.
ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు?
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి 2025 జూన్ 13 న లేఖ రాసాడు. ప్రాజెక్టుపై ఆంధ్ర సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలనీ, సవివరక్మైన ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) సమర్పించడం, టెండర్లు పిలవడం వంటి పనులపై ముందుకెళ్లకుండా ఆ రాష్ట్రాన్ని నిలువరించాలనీ ఆ లేఖలో కోరాడు.[8] ఈ ప్రాజెక్టు వలన తెలంగాణకు కేటాయించిన నికరజలాలు, తమకు లభ్యం కావని అందోళన వ్యక్తం చేసింది. 2014 నాటి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కొత్తగా చేపట్టే అంతర్రాష్ట్ర నదీ ప్రాజెక్టులకు ఎపెక్స్ కౌన్సిల్, కృష్ణా నదీ నిర్వహణ బోర్డు, కేంద్ర జల కమిషన్ల నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెబుతూ, ఆంధ్రప్రదేశ్ దీన్ని ఉల్లంఘించిందని తెలంగాణ ఆరోపించింది. 200 టిఎంసి ల మిగులు జలాల వాదనను గతంలో ట్రిబ్యునల్ నిర్ణయించలేదని కూడా తెలంగాణ చెప్పింది. ఈ ప్రాజెక్టు వలన తమ ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గుతుందని తెలంగాణ ఆందోళన తెలిపింది
Read hindi news: hindi.vaartha.com
Read Also: