జమ్ము కశ్మీర్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ మంచు కంటే అధికంగా మంచు కురుస్తోంది. జనజీవనం అతలాకుతలం అవుతున్నది. శ్రీనగర్ , దోడా, పుల్వామా, అనంత్నాగ్, బారాముల్లా, సోనమార్గ్, బందిపోర , పూంచ్, రాజౌరి సహా అనేక ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతూనే ఉంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి.

ఆకట్టుకుంటుకునే మంచు దృశ్యాలు
జమ్ముకశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల్లో నిరంతరంగా మంచు కురుస్తోంది. దీంతో రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులు, స్థానిక ప్రజలు, సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. మంచు గడ్డలతో ఆటలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
పెరిగిన పర్యాటకుల తాకిడి
సాధారణంగా శీతాకాలంలో జమ్ముకశ్మీర్కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంచు తెరల మాటు నుంచి కశ్మీర్ లోయలు, కొండల అందాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచేగాక, విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివస్తారు. మంచు వర్షానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి.
గట్టకట్టుకుపోయిన దాల్ సరస్సు
మరోవైపు భారీగా మంచు పడుతుండటంతో శ్రీనగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి చేరాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు కశ్మీర్ ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. ప్రముఖ దాల్ సరస్సు సహా పలు నదులు గట్టకట్టుకుపోయాయి.