ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా 48వ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన కీలక మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేయగలిగింది.భారీ ఛేదనలో ఢిల్లీకి ఇన్నింగ్స్ రెండో బంతికే షాక్ తగిలింది. అనుకుల్ బౌలింగ్లో పొరెల్ (4) మిడాఫ్ వద్ద రసెల్ చేతికి చిక్కాడు. కరుణ్ నాయర్ (15), కేఎల్ రాహుల్ (7) కూడా నిరాశపరిచారు. కానీ డుప్లెసిస్ ధాటిగా ఆడాడు. మూడు బౌండరీలతో హర్షిత్కు స్వాగతం పలికిన డుప్లెసిస్ వరుణ్ 8వ ఓవర్లో 4, 4, 6 దంచాడు. డుప్లెసిస్కు అక్షర్ జతకలవడంతో ఢిల్లీ స్కోరు వేగం ఊపందుకుంది. 31 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్న డుప్లెసిస్ అదే జోరును కొనసాగించాడు. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటించిన ఈ ద్వయం ఓవర్కు పది పరుగులకు తగ్గకుండా ఆడింది. 42 బంతుల్లోనే 76 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నరైన్ 14వ ఓవర్లో విడదీశాడు. ఒకే ఓవర్లో అక్షర్తో పాటు స్టబ్స్(1)ను ఔట్ చేసి కోల్కతాను పోటీలోకి తీసుకొచ్చాడు. అప్పటి వరకు లక్ష్యం వైపు సాఫీగా సాగిన ఢిల్లీని డుప్లెసిస్ను ఔట్ చేయడం నరైన్ మళ్లీ దెబ్బకొట్టాడు. ఈసారి తన వంతు అన్నట్లు వరుణ్ 18వ ఓవర్లో వరుస బంతుల్లో అశుతోష్(7), స్టార్క్(0)ను ఔట్ చేసి కోల్కతా విజయానికి బాటలు వేశాడు. ఆఖర్లో విప్రాజ్ నిగమ్(38) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది.
ఫలితం
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన అక్షర్ పటేల్ పవర్ ప్లేలో రాణించకపోవడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై తమ బ్యాటర్లు తేలిపోయారని చెప్పాడు.’పవర్ ప్లేలో మేం సరిగ్గా లేదు. మా బ్యాటింగ్ కూడా సరిగ్గా లేదు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నా మేం చాలా తేలిగ్గా వికెట్లు కోల్పోయాం. ఇలాంటి పిచ్లపై పవర్ప్లేలో మెరుగ్గా రాణించడం కీలకం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ, బ్యాటింగ్ వైఫల్యం మా ఓటమిని శాసించింది. బౌలింగ్లోనూ 15-20 పరుగులు అదనంగా ఇచ్చాం. ఈ మ్యాచ్ సానుకూలాంశం ఏంటంటే పవర్ ప్లే తర్వాత కేకేఆర్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాం. బ్యాటింగ్లో ఇద్దరు ముగ్గురు బ్యాటర్లు రాణించి ఉంటే మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారేది. విప్రజ్ బ్యాటింగ్ చేసే సమయంలో గెలుస్తామనే ఆశలు కలిగాయి. అషుతోష్ శర్మ రాణించి ఉంటే మా తొలి మ్యాచ్ తరహా ఫలితం పునరావృతమయ్యేది.ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నా వేలికి గాయమైంది. బంతిని ఆపే ప్రయత్నంలో ప్రాక్టీస్ పిచ్పై డైవ్ కొట్టడంతో చర్మం ఊడిపోయింది. బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాట్ హ్యాండిల్ ఆ ప్రదేశానికి తగలడంతో తీవ్ర నొప్పి వచ్చింది. మా తదుపరి మ్యాచ్కు 3-4 రోజుల విరామం ఉంది. ఆ మ్యాచ్లోపు కోలుకుంటానని ఆశిస్తున్నా.’అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
Read Also: IPL 2025: ముంబై ఇండియన్స్ పై అంబటి రాయుడు షాకింగ్ కామెంట్స్