దేశవ్యాప్తంగా జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి)లోని త్రిభాషా సూత్రం, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం,పలు రాష్ట్రాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఈ నేపథ్యంలో, తమిళ సినీ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (టివికె) పార్టీ కీలక తీర్మానాలను ఆమోదించింది. నేడు తిరువన్మయూర్లో జరిగిన తొలి జనరల్ కౌన్సిల్ సమావేశంలో మొత్తం 17 తీర్మానాలు ఆమోదం పొందాయి.
నియోజకవర్గాల పునర్విభజనపై వ్యతిరేకత
డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు తగ్గుతాయని చెప్పింది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఈ విధానాన్ని తాము అంగీకరించేది లేదని పేర్కొంది. నియోజక వర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేయటాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తేల్చి చెప్పింది. ఇక ఇదే సమయంలో తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకె ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఎన్ఇపి
జాతీయ విద్యా విధానం లోని(ఎన్ఇపి) త్రిభాషా సూత్రాన్ని తాము అంగీకరించేది లేదని టివికె పార్టీస్పష్టం చేసింది.ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానంలో ఉన్న మూడు భాషల విధానం ఫెడరలిజంకు విరుద్ధంగా ఉందని టీవికే పార్టీ అభిప్రాయపడింది.

టివికె పార్టీ
త్రిభాషా విధానం,డీలిమిటేషన్ వంటి కీలక అంశాలపై పార్టీ స్టాండ్ ను ఈ సమావేశంలో తీసుకుంది టీవీకే పార్టీ. మొత్తానికి వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసి రంగంలోకి దిగుతున్న హీరో విజయ్ టీవీకే పార్టీ తమిళనాట తన సంచలన నిర్ణయాలతో ప్రజల మద్దతు కోసం అడుగులు వేస్తుంది.
డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు
ఇక రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని, దానిని నియంత్రించడంలో అధికార ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వెల్లడించింది.ఉద్యోగుల పాత పెన్షన్ పథకంపై ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు చేసిందని టీవీకే పార్టీ విమర్శించింది. శ్రీలంకలో అరెస్ట్ అయిన భారతీయ మత్స్యకారుల సమస్యను టీవీకే పార్టీ వదిలిపెట్టదని మత్స్యకారులకు అండగా ఉంటామని పేర్కొంది. ఇక మత్సకారుల కుటుంబాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది.ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల మద్దతు కోసం అడుగులు వేస్తోంది.విజయ్ రాజకీయాల్లో మరింత చురుకుగా మారుతున్న నేపథ్యంలో, తమిళనాడు రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయో అనే చర్చ మొదలైంది.