దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు చేసిన తొలిరాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో సోమవారం నుంచి యూసీసీ అమల్లోకి వచ్చింది. ఉత్తరాఖండ్లోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, కొన్ని మత సంఘాలు వ్యతిరేకించాయి. యూసీసీ అమలుకు అధికారుల శిక్షణ సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. తాము అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామంటూ 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. బీజేపీ 2022 ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ ఏర్పాటైనప్పటి నుంచి ఏ పార్టీ కూడా అక్కడ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదు. తమ విజయానికి యూసీసీ కూడా ఒక కారణమని ధామి అన్నారు.

ఉత్తరాఖండ్లో యూసీసీ అమలుకు ఒక రోజు ముందు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ, ఇది బీజేపీ పైలట్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఉత్తరాఖండ్లో దీన్ని అమలు చేసి ప్రజాస్పందన తెలుసుకోవాలని బీజేపీ చూస్తోంది. తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలనుకుంటోంది. ఈ అంశంపై ఏకాభిప్రాయం లేకపోవడంతో బీజేపీ, ఉత్తరాఖండ్ నుంచి దీన్ని ప్రయత్నిస్తోంది అని సింఘ్వీ అన్నారు.
ఏం మారుతుంది?
ఉత్తరాఖండ్లోని గిరిజన తెగలు, ప్రత్యేక రక్షణ ఉన్న వ్యక్తులు, సముదాయాలకు మినహాయించి మిగతా ప్రజలందరికీ యూసీసీ వర్తిస్తుంది. ఉత్తరాఖండ్ యూసీసీ చట్టంలో వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం, వీటికి సంబంధించిన అంశాలు మిళితమై ఉంటాయి. ఇది స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సును నిర్ధారిస్తుంది. అన్ని మతాల వారికి విడాకులు, ఇతర విధానాలకు ఒక పునాదిని నిర్మిస్తుంది. ఈ చట్టం బహుభార్యత్వాన్ని నిషేధిస్తుంది. ఈ చట్టం ప్రకారం, జీవిత భాగస్వామి లేని ఇద్దరి మధ్య మాత్రమే వివాహం జరుగుతుంది. కనీస వివాహ వయస్సు పురుషుడికి 21 ఏళ్లు, స్త్రీలకు 18 సంవత్సరాలు ఉండాలి.
వివాహ నిబంధనలు
చట్టపరమైన విధానాలు లేదా మతపర ఆచారాల ప్రకారం వివాహం జరగొచ్చు. వివాహం జరిగిన 60 రోజుల్లోపు ఆ పెళ్లిని రిజిస్టర్ చేయాలని యూసీసీ చట్టం తెలుపుతోంది. యూసీసీ కింద అన్ని విధాలైన వివాహాలు, సహ జీవన బంధాలను రిజిస్టర్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే ఆన్లైన్ ద్వారా వివాహాన్ని రిజిస్టర్ చేసే కేంద్రాలను ఏర్పాటు చేశారు.