గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రజల అంచానాలను అందుకోలేకపోవడానికి కాంగ్రెస్ నేతలే కారణమని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో ఉంటూ బీజేపీకి పనిచేస్తున్న వారిని గుర్తించాలని ఆయన చేసిన సూచన సంచలనం రేపుతోంది. అటు గుజరాత్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సరైన దిశానిర్దేశం చేయలేకపోతోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్మథనంలో పడింది.
సగం మంది బీజేపీతో టచ్లో ఉన్నారు
అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ గత 20-30 ఏళ్లుగా ప్రజల అంచనాలను ఎందుకు అందుకోలేకపోయింది? దీనికి సమాధానం ఒక్కటే అని అన్నారు. గుజరాత్ నాయకత్వం, కార్యకర్తలు, జిల్లా, బ్లాక్ అధ్యక్షులలో రెండు రకాల నాయకులు ఉన్నారు. ఒక వర్గం నిజాయితీగా పనిచేస్తూ, ప్రజలను గౌరవిస్తూ వారి కోసం పోరాడుతున్నారు. పార్టీ సిద్ధాంతాన్ని తమ గుండెల్లో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇక రెండో రకం ప్రజలతో సంబంధాలు కొనసాగించకుండా వారితో దూరంగా ఉంటూ, కనీసం గౌరవం కూడా ఇవ్వరు. వీరిలో సగం మంది బీజేపీతో టచ్లో ఉన్నారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ ప్రజలు కొత్త విజన్ కోసం ఎదురు
గుజరాత్లో మూడు దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉంది. ఈ పాలనలో రాష్ట్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని రాహుల్ విమర్శించారు. గుజరాత్ ప్రజలు కొత్త విజన్ కోసం ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందని రాహుల్ పేర్కొన్నారు. అయితే, ప్రజలకు సరైన మార్గం చూపించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన అంగీకరించారు. బీజేపీకి ‘బి-టీమ్’ కాదని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. “ఈ రెండు వర్గాలను వేరు చేయడం నా బాధ్యత. కాంగ్రెస్లో నాయకులకు కొదవలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 22 శాతం పెరిగిందని రాహుల్ గుర్తు చేశారు. గుజరాత్లో 40 శాతం ఓట్లు కాంగ్రెస్కు ఉన్నాయని ఆయన అన్నారు. “మనం ప్రజలతో కలిసి పనిచేయాలి. భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలతో సులభంగా కనెక్ట్ అవ్వగలదని చూపించామని గుర్తుచేశారు. దేశ రాజకీయాలను మార్చగలమని నిరూపించామన్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పార్టీలో కలకలం
మన కార్యకర్తలైనా, రాహుల్ గాంధీ అయినా, ప్రధాన కార్యదర్శి అయినా, పీసీసీ అధ్యక్షుడైనా గుజరాత్కు సరైన మార్గాన్ని చూపించలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పార్టీలో అంతర్గతంగా బీజేపీకి సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అయితే, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు గుజరాత్ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది. పార్టీలో ప్రక్షాళన జరగాలని, బీజేపీతో సంబంధాలున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.