అపరాధ రుణదారులపై తమిళనాడు ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది.బెదిరించి మరీ అప్పులు వసూలు చేసినట్లు తేలితే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించబోతున్నట్లు సర్కారు వివరించింది. ఇటీవలే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టగా తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ ఆర్.ఎన్ రవి ఆమోదం తెలిపారు.తమిళనాడులో ఇకపై బలవంతపు రుణ వసూళ్లకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని సర్కారు తెలిపింది. రుణగ్రహీతలను వేధించడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపడానికి ఉద్దేశించిన కీలక బిల్లుకు గవర్నర్ ఆర్.ఎన్. రవి (R.N.Ravi) తాజాగా ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలు అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న రుణదాతల నుంచి తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటున్నట్లు ఇటీవలే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని కొన్ని ఫైనాన్స్ సంస్థలు బెదిరింపులకు పాల్పడుతున్నాయని చెప్పారు. అప్పులు కట్టమని బలవంతం చేస్తున్నారని ప్రజలు వివరించారు.
చట్టంగా మారింది
డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ దీనిపై స్పందిస్తూ, ఏప్రిల్ 26వ తేదీన ఒక కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అప్పు ఇచ్చిన సంస్థలు ఎవరినీ బెదిరించకూడదని, బలవంతంగా డబ్బు వసూలు చేయకూడదని ఆయన అన్నారు. అయితే డీఎంకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘తమిళనాడు నిషేధిత బలవంతపు రుణ వసూలు బిల్లు 2024’కు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఇప్పుడు ఇది చట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం అప్పు ఇచ్చిన సంస్థలు అప్పు తీసుకున్న వారిని లేదా వారి కుటుంబ సభ్యులను బెదిరించకూడదు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకోకూడదు.అలా చేస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధించబడుతుంది.అలాగే ఎవరైనా బలవంతంగా అప్పు వసూలు చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుంటే, అప్పు ఇచ్చిన సంస్థే ఆత్మహత్యకు కారణమని భావిస్తారు.
రుణగ్రహీతలకు
ఇలాంటి కేసుల్లో నిందితులకు బెయిల్ కూడా ఇవ్వరు. ఈ చట్టం రుణగ్రహీతలకు రక్షణ కల్పించడమే కాకుండా, రుణ వసూలు పద్ధతులలో పారదర్శకతను, చట్టబద్ధతను తీసుకువస్తుంది.ఈ బిల్లుతో పాటు, ‘తమిళనాడు పంచాయతీలు (రెండో సవరణ) బిల్లు 2024’కు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కొన్ని నిబంధనలను సవరించడానికి ఉద్దేశించబడింది. రెండు బిల్లుల ఆమోదంతో రాష్ట్రంలో పరిపాలన, పౌర సంబంధిత విషయాలలో మరిన్ని సంస్కరణలకు మార్గం సుగమం అయినట్లయింది. బలవంతపు వసూళ్ల నివారణ చట్టం, రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఎంతో మందికి ఊరటనిస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇది రుణ వసూళ్ల ప్రక్రియలో మానవత్వాన్ని, చట్ట పాలనను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
Read Also: Plane Crash: విమాన ప్రమాదం.. చెట్టుకింద నిద్రిస్తున్న చిన్నారి మృతి