Sridevi Property case: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి మరణించి ఇన్నేళ్లవుతున్నా ఆమె ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీదేవికి చెందిన విలువైన భూమి విషయంలో చెన్నై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లకు తాత్కాలికంగా ఊరట లభించింది.
Read Also: Digital attacks : మితిమీరుతున్న ‘డిజిటల్ దాడులు.
ఏమిటీ ఆస్తి వివాదం?
వివరాల్లోకి వెళ్తే.. చెన్నై సమీపంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ECR), చెంగల్పట్టు ప్రాంతంలో శ్రీదేవికి సుమారు 4.7 ఎకరాల అత్యంత విలువైన భూమి ఉంది. ఈ భూమిని శ్రీదేవి 1988 ఏప్రిల్ 19న ఎం.సి. సంబంధ ముదలియార్ అనే వ్యక్తి నుండి చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అప్పటి నుండి ఈ ఆస్తి ఆమె కుటుంబ ఆధీనంలోనే ఉంది.

అయితే, 2005లో ముదలియార్ వారసులమని చెప్పుకుంటూ ముగ్గురు వ్యక్తులు రంగంలోకి దిగారు. తాంబరం తహసీల్దార్ కార్యాలయం నుండి వారసత్వ ధృవీకరణ పత్రాలు పొంది, ఆ భూమిపై హక్కులు కోరుతూ సివిల్ దావా వేశారు. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది.
బోనీ కపూర్ కుటుంబం వాదన
తమ ఆస్తిని అక్రమంగా అనుభవిస్తూ, నకిలీ పత్రాలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బోనీ కపూర్ కుటుంబం మద్రాస్ హైకోర్టులో జాయింట్ పిటిషన్ దాఖలు చేసింది.
- ముదలియార్ కుటుంబం అసలు తాంబరంలో నివసించలేదని, వారు మైలాపూర్లో ఉండేవారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
- వారసులమని చెప్పుకుంటున్న వారిలో ఒకరు ముదలియార్ రెండో భార్య అని, మొదటి భార్య బతికి ఉండగా జరిగిన ఆ వివాహం చట్టబద్ధం కాదని బోనీ కపూర్ తరపు న్యాయవాదులు వాదించారు.
- హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారికి ఆ ఆస్తిలో ఎటువంటి వాటా ఉండదని స్పష్టం చేశారు.

హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ కేసును విచారించిన జస్టిస్ టి.వి. తమిళ్ సెల్వి నేతృత్వంలోని ధర్మాసనం, స్థానిక కోర్టులో జరుగుతున్న విచారణపై తాత్కాలిక స్టే విధించింది. అలాగే, జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ మాట్లాడుతూ.. సదరు ముగ్గురు వ్యక్తుల పేరిట ఉన్న మోసపూరిత పత్రాలను రద్దు చేయాలని ఆదేశించారు. దీనిపై నాలుగు వారాల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని తాంబరం తహసీల్దార్కు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.
మార్చి 26న తుది విచారణ
ప్రస్తుతానికి బోనీ కపూర్ కుటుంబానికి స్టే రూపంలో ఊరట లభించినప్పటికీ, తదుపరి విచారణను కోర్టు మార్చి 26, 2026కి వాయిదా వేసింది. ఆ రోజున కోర్టు ఇచ్చే తుది తీర్పుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. శ్రీదేవి కష్టపడి సంపాదించిన ఆస్తి చివరకు ఎవరి పరం అవుతుందో వేచి చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: