ఒక్కరోజు గడవకముందే విమర్శలు ఎందుకని రేఖా గుప్తా ఆగ్రహం
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన తొలి రోజే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆమ్ ఆద్మీ పార్టీ 13 ఏళ్లు ఢిల్లీని పాలించాయి.
ఇన్నేళ్లు వారు ఏమి చేశారో ప్రజలు అడగాలి. కానీ, మేము ఇంకా ఒక్కరోజు కూడా పూర్తి చేయకముందే ఆరోపణలు చేయడమేంటని” ఆమె మండిపడ్డారు.

తొలి రోజే కీలక నిర్ణయాలు
రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తాము కేబినెట్ సమావేశాన్ని నిర్వహించామని, అందులో ఆయుష్మాన్ భారత్ యోజన అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని తెలిపారు. దీని ద్వారా ఢిల్లీ ప్రజలకు రూ.10 లక్షల వరకు వైద్య సహాయం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. గత పాలకులు ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోలేదని ఆమె విమర్శించారు.
పదమూడేళ్లు ఏమీ చేయని వారికి ప్రశ్నించే హక్కు లేదు
13 ఏళ్లుగా ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలి. పదమూడేళ్ల పాటు పట్టించుకోని వారు, మా ప్రభుత్వాన్ని ఒక రోజులోనే ఎలా దోషిగా చూపాలని చూస్తున్నారు?” అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం తన హక్కులను సాధించుకుని, మరింత అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు.
ఆప్ను వీడాలని చూస్తున్నవారు ఎందరో
ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోందని, అధిక సంఖ్యలో నాయకులు ఆ పార్టీని వీడాలని చూస్తున్నారని రేఖా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. “కాగ్ నివేదికను అసెంబ్లీలో పెట్టిన తర్వాత అసలు నిజాలు బయటికొస్తాయి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అతిషి ఆరోపణలపై ఘాటైన కౌంటర్
మాజీ సీఎం అతిషి చేసిన ఆరోపణలకు స్పందించిన రేఖా గుప్తా, “మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ తొలి కేబినెట్ సమావేశంలో ఆ అంశాన్ని విస్మరించిందని ఆమె ఆరోపించారు. దానిపై స్పందిస్తూ, “ముందుగా మీ పార్టీ పాలన ఎలా సాగిందో ప్రజలకు వివరణ ఇవ్వండి. మీరు విస్మరించిన హామీల గురించి కూడా ప్రజలకు చెప్పండి” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.