కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆదివారం మధ్యాహ్నం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా మారి ఈ సంఘటనకు దారి తీసినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.మృతుడి కుమారుడు కార్తికేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తన తల్లి పల్లవి, సోదరి కృతి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని కార్తికేష్ అనుమానం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా వారిద్దరూ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం. తరచూ ఓం ప్రకాశ్తో ఘర్షణలు జరిగేవని కార్తికేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఓం ప్రకాశ్ గత వారం తన భార్య పల్లవి నుంచి ప్రాణహాని ఉందని భావించి తన మరదలు సరితా కుమారి ఇంట్లో నివసిస్తున్నారు.

అయితే శుక్రవారం రోజున కృతి స్వయంగా అక్కడికి వెళ్లి, తండ్రిని తిరిగి ఇంటికి తీసుకువచ్చిందని కార్తికేష్ పోలీసులకు వివరించారు.హత్య జరిగిన రోజు ఇంట్లో తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది.మధ్యాహ్న భోజన సమయంలో పరిస్థితి అదుపు తప్పి, ఘర్షణ ఘాతుకానికి దారితీసిందని పోలీసులు చెబుతున్నారు.పొరుగువారి ఫోన్ కాల్ ద్వారా ఈ దారుణం గురించి తెలుసుకున్న కార్తికేష్, వేగంగా ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి ప్రవేశించగానే అక్కడ కత్తులు, పగిలిన సీసాలు పడిన దృశ్యం చూసి షాక్కు గురయ్యాడు. తండ్రి మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.సోమవారం కృతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆదివారం సాయంత్రమే పల్లవిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇద్దరినీ విచారిస్తున్నట్లు సౌత్ ఈస్ట్ డీసీపీ సారా ఫాతిమా తెలిపారు. కుటుంబ కలహాలే హత్యకు దారితీశాయనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కేసును మరింత లోతుగా పరిశీలించి అసలు నిజాలు వెలుగులోకి తీసుకురావడానికి పోలీసులు శ్రమిస్తున్నారు.కుటుంబ సమస్యలే మానవ జీవితాలను ఎంతగా ప్రభావితం చేయగలవో ఈ ఘటన మరోసారి రుజువైంది. ఓ అత్యున్నత స్థాయిలో సేవలందించిన పోలీసు అధికారి ఇలా కుటుంబ సమస్యల్లోనే బలైపోవడం చాలా దురదృష్టకరం.
Read Also : పోప్ ఫ్రాన్సిస్ మృతిపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి