ఒడిశా కోరాపుట్లో విషాదం – ఆసుపత్రిలో ఒక్కరేయిలో ఐదుగురు రోగుల మృతి
Odisha: రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా కేంద్రంలో ఉన్న సహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ఒక్క రాత్రిలో ఐదుగురు రోగుల ప్రాణాలు తీసిన ఘోర ఘటనకు కేంద్రంగా మారింది.
మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు అనుమానాస్పద రీతిలో మరణించారు.
వీరి మృతికి అసలైన కారణం ఏమిటన్నదానిపై స్పష్టత రానప్పటికీ, బాధిత కుటుంబాలు తాము చూసినదాన్ని బట్టే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందంటూ ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా వైద్య సిబ్బంది ఇచ్చిన ఇంజెక్షన్లపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంజెక్షన్ అనంతరమే ఆరోగ్యం క్షీణించింది
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU), సర్జికల్ వార్డులలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఐదుగురు వ్యక్తులు గత రాత్రి మరణించారు.
కొన్ని నిమిషాల ముందు ఆసుపత్రి సిబ్బంది వీరికి రెండో విడత ఇంజెక్షన్లు ఇచ్చినట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. “అర్ధరాత్రి సమయంలో ఒక నర్సు మా పక్కనే ఉన్న ముగ్గురు రోగులకు ఇంజెక్షన్ ఇచ్చింది.
మా సోదరికి కూడా అదే ఇంజెక్షన్ వేసింది. అది వేసిన కొన్ని క్షణాల్లోనే ఆమె తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయింది. మేము డాక్టర్ను పిలిచి, ఆయన వచ్చి పరీక్షించేలోపే ఆమె ప్రాణాలు విడిచింది” అని బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
మరణించిన వారందరూ అంతకుముందు ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారని, ఆపరేషన్ల అనంతరం వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని బంధువులు పేర్కొన్నారు.
అయితే, నర్సు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతే వారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని ఆరోపించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన మృతుల కుటుంబ సభ్యులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆసుపత్రి ముందు ఆందోళన – పోలీసులు రంగంలోకి
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణాలకు కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇది యాక్సిడెంటా? లేక అపరాధమా?
ఒకే రాత్రిలో ఐదుగురు రోగుల మరణం అనేది సాధారణ సంఘటన కాదని పలువురు వైద్య నిపుణులు అంటున్నారు. ఇది కేవలం వైద్యపరమైన పొరపాటా? లేక నిబంధనలు అతిక్రమించి ఇంజెక్షన్లు వేయడమా? అన్నదానిపై పూర్తి స్థాయి విచారణ అవసరం.
ఇంజెక్షన్ల డోస్, వాటి నిల్వ పరిస్థితులు, నర్సింగ్ సిబ్బంది ట్రైనింగ్ వంటి అంశాలపై అధికారుల దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో రోగులపై ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.
Read Also: Trump: ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ఆర్థిక సంక్షోభం!