రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలం చికిత్స అందించగలితే వారి ప్రాణాలను కాపాడవచ్చు. ఏటా లక్షల మంది రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు.ఈ క్రమంలో క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందించే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదాల్లో గాయపడినవారికి ఇకపై రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనుంది.ఇందుకు సంబంధించిన కేంద్ర రహదారుల రవాణాశాఖ సోమవారం రాత్రి నోటిఫికేషన్ను విడుదల చేసింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025’ పేరుతో ఈ పథకం అమల్లోకి వచ్చింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దేశంలో రోడ్డు ప్రమాదాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం
సుప్రీంకోర్టు గత జనవరిలో రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లో ఉచిత వైద్యం అందించాలని తీర్పు వెలువరించింది. దీనికి అనుగుణంగా కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది. నోటిఫికేషన్లో “క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025” అనే పేరుగా పేర్కొన్నారు. ఈ పథకం కింద మోటారు వాహనం ప్రమాదానికి గురైతే రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చు. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడు రోజుల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ట్రామా, పాలీట్రామా సేవలు అందించే ఆసుపత్రులను ఈ పథకం కిందకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకురాగానే వైద్య సేవలు ప్రారంభించాలి. ఒకవేళ ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోతే, వెంటనే మరో ఆసుపత్రికి తరలించాలి. రవాణా సౌకర్యాన్ని కూడా ఆసుపత్రే ఏర్పాటు చేయాలి. బాధితుడిని డిశ్చార్జ్ చేసిన తర్వాత, ఆసుపత్రి బిల్లును పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఈ పథకం రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
ప్రభుత్వం
ఈ పథకం స్థానికులు, పేదలు అనే తేడా లేకుండా ప్రమాదానికి గురైన ఎవరికి అయినా వర్తిస్తుంది. గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఆధార్ లేకున్నా కూడా చికిత్స ప్రారంభించవచ్చు. ఈ స్కీంలో ఆసుపత్రులకు వేగంగా బిల్లుల చెల్లింపు అందించే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ముందుకు రావడానికి తోడ్పడుతుంది. రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడేవారికి కూడా కేంద్రం రూ.25 వేలు ప్రోత్సహకాన్ని కూడా అందజేస్తోంది.
Read Also :India: సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు వేర్వేరు ప్రక్రియలు