కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)తో సహా వివిధ పార్టీలు బుధవారం బంద్, నిరసనకు పిలుపునిచ్చాయి.దీంతో జమ్మూ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రత్యక్ష సాక్షి
ఫుడ్స్టాల్స్ వద్ద కొందరు, గుర్రాలపై స్వారీ చేస్తూ కొందరు, పచ్చిక బయలుపై కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరి కొందరు పర్యాటకులు ఉన్న సమయంలో అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్చవద్దని మహిళలు వేడుకుంటున్నా వారు కనికరించలేదు. ఇతను ముస్లిం కాదు కాల్చేయండి అని ఓ ఉగ్రవాది అన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. భర్తను, ఆప్తులను కోల్పోయిన చాలా మంది మహిళలు సాయం కోసం స్థానికులను అర్థించే దృశ్యాలు వైరల్ అయ్యాయి.ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నందున క్షతగాత్రులను తరలించడానికి సైనిక హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. భద్రతా ఏర్పాట్ల మధ్య ఇతర పర్యాటకులను అక్కడి నుంచి అధికారులు తరలించారు.పహల్గామ్ దాడిని ఖండిస్తూ సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు. ఈ ఘటన కలిచివేసిందని, గుండె బరువెక్కిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
పరామర్శించి
ఈరోజు ఉదయం శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా పెహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని పరామర్శించి ఓదార్చారు. వారి వేదనను విన్నారు. ఈ సందర్భంగా తమ ఆప్తులను కోల్పోయిన వారు కేంద్ర మంత్రి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. విహారయాత్ర కోసం వస్తే మావాళ్లను పొట్టన పెట్టుకున్నారంటూ రోదించారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also: Pahalgam Terror Attack: విదేశీ అతిథులు ఉన్నప్పుడే భారత్పై ఉగ్రదాడులు