మరికొన్ని రోజుల్లోనే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండగా.. అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈక్రమంలోనే ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్.. న్యూఢిల్లీ స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న పర్వేష్ వర్మపై విమర్శలు చేశారు. వర్మ పంజాబీలను జాతీయు ముప్పుగా అభివర్ణించారంటూ చెప్పారు. దీనిపై స్పందించిన బేజీపీ అభ్యర్థి.. అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్లపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని వివరించారు.
జనవరి 26వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో జరిగే పరేడ్కు ముందు పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున కార్లు వస్తున్నాయని.. వాటి వల్ల నగరంలో పెద్ద ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటూ ఇటీవలే బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ తెలిపారు. అయితే బీజేపీ నాయకుడు చేసిన ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన అర్వింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

ముఖ్యంగా దేశం కోసం అపారమైన త్యాగాలు చేసిన లక్షలాది మంది పంజాబీలకు ఢిల్లీ నిలయం అని తెలిపారు. అలాగే దశ విభజన సమయంలో ఎంతో మంది పంజాబీలు ఢిల్లీకి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డారని.. వారి వల్లే ఢిల్లీ ఇంతలా అభివృద్ధి చెందిందంటూ కేజ్రీవాల్ వివరించారు. ఢిల్లీలో అంతర్భాగమైన పంజాబీలపై ఇలాంటి కామెంట్లు చేయడం చాలా బాధాకరం అంటూ చెప్పుకొచ్చారు. పంజాబీ కమ్యూనిటీని అవమానించేలా పర్వేష్ వర్మ చేసి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తాజాగా దీనిపై పర్వేష్ వర్మ స్పందించారు. అలాగే రాముడు, హనుమంతుడి గురించి కూడా కేజ్రీవాల్ తప్పుగా మాట్లాడి.. హిందూ విశ్వాసాలను అగౌరవ పరిచారని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేసిన కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్లపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయబోతున్నట్లు ప్రకటించారు.