యుద్ధ విమానాల(War Flights) తయారీ దిశగా తెలంగాణలోని హైదరాబాద్(Hyderabad) పరిశ్రమలు ముందడుగు వేశాయి. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ మార్క్-1ఏ(Tejas Mark-1) మధ్య భాగం మొదలు నూతనంగా అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఆమ్కా)కి సంబంధించిన బాడీ మొత్తం హైదరాబాద్లోనే తయారవుతోంది. ఒకప్పుడు పూర్తిగా ప్రభుత్వ రక్షణ సంస్థలే ఉత్పత్తి చేసిన వీటిని ఆ ప్రమాణాల మేరకు తయారు చేస్తూ తమకూ సామర్థ్యం ఉందని ప్రైవేటు సంస్థలు నిరూపిస్తున్నాయి.
ఆమ్కా తయారీ అవకాశాలు
ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని సాకారం చేసే దిశగా ఎగ్జిక్యూషన్ నమూనాకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ లోహ విహంగం డిజైన్ బెంగళూరులో జరగ్గా బాడీ ఫ్యాబ్రికేషన్ హైదరాబాద్లోని వెమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో చేపట్టారు. దీన్నే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన ఏరో ఇండియాలో మొదటిసారి ప్రదర్శించారు. కేంద్రం ప్రైవేటు సంస్థలకు పోటీ ప్రాతిపదికన ఆమ్కా తయారీ అవకాశాలు కల్పించబోతోంది. దీని రూపకల్పనలో హైదరాబాద్ సంస్థకు అనుభవం ఉండటంతో నగరానికే దక్కే అవకాశం ఉంటుంది. కాక్పిట్, రాడార్, ల్యాండింగ్ గేర్ను ఏడీఏ, ఏవియానిక్స్, హెచ్ఏఎల్ అభివృద్ధి చేస్తోంది.
భారత్లో తయారీ కింద రక్షణ ఉత్పత్తుల విషయంలో ప్రైవేటు సంస్థలకూ అవకాశం ఇవ్వడంతో ఉత్పత్తిలో వేగం పెరిగిందని వెమ్ టెక్నాలజీస్ సీవోవో ఆర్ శ్రవణ్ రావు ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు వివరించారు ఆమ్కా పూర్తి బాడీ డిజైన్, కావాల్సిన మెటాలిక్, కంపోజిట్ విడిభాగాల వరకు ఉత్పత్తి చేసి వీటిని అసెంబ్లింగ్ చేశామని ఆయన తెలిపారు.
పెద్ద మొత్తంలో ఆర్డర్లు
యుద్ధ విమానం తేజస్ మార్క్-1ఏకి వాయుసేన నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఉన్నాయి. నౌకాదళం కూడా వీటిని అడుగుతోందని రక్షణ వర్గాలు అంటున్నాయి. తేజస్ మార్క్-1ఏలో 5 భాగాలు ఉంటే అందులో మధ్య భాగాన్ని హైదరాబాద్ నగరంలోని వెమ్ టెక్నాలజీస్ డెవలప్ చేసింది. ప్రస్తుతం మరింత అధునాతన తేజస్ మార్క్-1ఏ కి మధ్య భాగాన్ని సిద్ధం చేశారు. మొదటి ఉత్పత్తిని రేపు (మే 30)న హెచ్ఏఎల్కు అందజేయబోతున్నారు. ప్రస్తుతం ఒక గిగ్పై ఒక మధ్య భాగం తయారీకి 3 నెలల టైం పడుతుందని వెమ్ టెక్నాలజీస్ జీఎం సీహెచ్వీ రామారావు అన్నారు. తమకు యాభై ఆర్డర్లు వచ్చాయని తెలిపారు. “ఒక గిగ్పై ఒక మధ్య భాగం తయారీకి 3 నెలల టైం పడుతుంది. మాకు 50 ఆర్డర్లు వచ్చాయి. ప్రస్తుతం మరింత అధునాతన తేజస్ మార్క్-1ఏ కి మధ్య భాగాన్ని సిద్ధం చేశాం. మొదటి ఉత్పత్తిని రేపు హెచ్ఏఎల్కు అందజేయబోతున్నాం అన్నారు వెమ్ టెక్నాలజీస్ జీఎం సీహెచ్వి రామారావు.
Read Also: Owaisi: సౌదీలో పాకిస్థాన్ ను తీవ్రంగా విమర్శించిన అసదుద్దీన్ ఒవైసీ