Encounter: గురువారం జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్లో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. బసంత్గఢ్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి సైన్యం సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించింది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఓ ప్రాంతంలో ఎటాక్ చేసింది. ఈ టైంలో జరిగిన కాల్పుల్లో జవాన్ అమరుడైనట్టు సైన్యం ప్రకటించింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా
కాగా, 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలను మట్టుబెట్టేందుకు సైన్యం వేట సాగిస్తోంది. లోయలోని అనుమానిత ప్రాంతాలను జల్లెడపడుతోంది. పహల్గాం దాడిని సీరియస్గా తీసుకున్న కేంద్రం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దాడి జరిగిన క్షణం నుంచి వందల మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి ఆపరేషన్ ఏరివేత చేపట్టారు. బోర్డర్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా పెట్టారు. డేగ కళ్లతో పహారా కాస్తున్నారు.
పాకిస్థాన్కు చెందిన కరెన్సీ, మారణాయుధాలు స్వాధీనం
ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల సమయంలో కూడా కొందరు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అలా వచ్చిన ఉగ్రవాదులను భారత్ సైన్యం తుపాకీగుళ్లతో గతం పలికింది. బోర్డర్లోనే వాళ్లను మట్టుబెట్టి వారి వద్ద నుంచి పాకిస్థాన్కు చెందిన కరెన్సీ, మారణాయుధాలు స్వాధీనం చేసుకుంది. ఇలాంటివి మరిన్ని జరగొచ్చనే అంచనాలతో పూర్తి అలర్ట్గా సైన్యం ఉంది.
Read Also: గౌతమ్ గంభీర్ను చంపేస్తామంటూ బెదిరింపులు