Cricket: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బ్లూ జెర్సీలో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే బంగ్లాదేశ్తో జరగాల్సిన వన్డే సిరీస్పై నెలకొన్న అనిశ్చితి అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సిరీస్కు భారత ప్రభుత్వం నుంచి అనుమతి కోసం బీసీసీఐ (BCCI) ఎదురుచూస్తోందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు టీమిండియా స్టార్ ఆటగాళ్ల రీ-ఎంట్రీపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఆగస్టు 17 నుంచి 31 వరకు జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్లు ఈ అనిశ్చితి కారణంగా ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అభిమానుల నిరీక్షణ
టీమిండియా లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను మళ్ళీ బ్లూ జెర్సీలో చూడాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రెడ్ బాల్ క్రికెట్ (Cricket) కు గుడ్బై చెప్పడంతో, ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఈ ఇద్దరు ఆటగాళ్లను అభిమానులు చూడలేకపోయారు. ఆగస్టులో బంగ్లాదేశ్తో జరిగే వన్డే సిరీస్తో ఈ ఇద్దరు దిగ్గజాలు రీ-ఎంట్రీ ఇస్తారని అందరూ ఆశించారు. కానీ, ఆ సిరీస్ జరుగుతుందా, లేదా అనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదని స్వయంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంటే ప్రకటించడం అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపింది. ఈ సిరీస్ సజావుగా సాగితేనే రోహిత్, కోహ్లీలను మళ్ళీ బ్లూ జెర్సీలో చూసే అవకాశం లభిస్తుంది. లేదంటే వారి పునరాగమనం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వ అనుమతి కోసం బీసీసీఐ ఎదురుచూపులు
భారత్తో జరగాల్సిన వన్డే సిరీస్కు భారత ప్రభుత్వం నుంచి అనుమతి కోసం బీసీసీఐ ఎదురుచూస్తోందని బీసీబీ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లామ్ (Aminul Islam) స్పష్టం చేశారు. బీసీబీ 19వ బోర్డు మీటింగ్ షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో నిర్వహించిన తర్వాత అమినుల్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. బీసీసీఐ (BCCI) ప్రస్తుతం భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని, సిరీస్ కోసం ఆటగాళ్లను బంగ్లాదేశ్ (Bangladesh) పంపేందుకు ఒక క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. టీమిండియా ఇతర దేశాలకు వెళ్లే ప్రతిసారీ భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలోనూ పాకిస్తాన్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం నిరాకరించడంతో, భారత్ మ్యాచ్లు మాత్రం యూఏఈ (UAE) వేదికగా నిర్వహించాల్సి వచ్చింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరిగా లేని కారణంగా అలా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారడం, ఆ తర్వాత జరిగిన సంఘటనల దృష్ట్యా భారత ప్రభుత్వం టీమిండియా ఆటగాళ్లను అక్కడికి పంపించడానికి ఆలోచిస్తుందేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
షెడ్యూల్ మరియు అంచనాలు
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17 నుంచి 31 వరకు బంగ్లాదేశ్ – భారత్ మధ్య వైట్ బాల్ క్రికెట్ జరగనుంది. తొలుత వన్డే సిరీస్, ఆ తర్వాత టీ20 సిరీస్ నిర్వహించబడుతుంది. మూడు వన్డే మ్యాచ్ల కోసం ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సిద్ధంగా ఉండగా, టీ20ల కోసం యువ భారత జట్టు సిద్ధమైంది. వన్డే సిరీస్ ఢాకా, చిట్టగాంగ్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్కు ప్రభుత్వ అనుమతి లభిస్తే, క్రికెట్ అభిమానులకు ఇది ఒక పండుగే అవుతుంది. భారత క్రికెట్ బోర్డు మరియు ప్రభుత్వ మధ్య చర్చలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయని ఆశిద్దాం.
Read also: Dom Sibley Triple Century: డొమ్ సిబ్లీ ట్రిపుల్ సెంచరీ– సుర్రే భారీ స్కోరు