వక్ఫ్ సవరణ బిల్లు 2024ను పార్లమెంట్ ముందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లీస్ ఇ-ఇత్తేహదుల్ ఇస్లామీన్ అధినేత అసుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. బిల్లు ఆమోదం పొందితే దేశంలో సామాజిక అస్థిరతకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును మొత్తం ముస్లిం సమాజం తిరస్కరించిందని ఒవైసీ చెప్పారు. సోమవారం ఆయన పార్లమెంట్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పారు. ‘‘నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.. ప్రతిపాదన వక్ఫ్ చట్టాన్ని తీసుకొస్తే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26, 14లను ఉల్లంఘిస్తుంది.. ఈ దేశంలో సామాజిక అస్థిరతకు దారితీస్తుంది. దీనిని మొత్తం ముస్లిం సమాజం తిరస్కరించింది.. వక్ఫ్ ఆస్తులు ఏమీ ఏదీ మిగలవు’’ అని అన్నారు.
‘మీరు దేశాన్ని వికసిత్ భారత్’గా మార్చాలనుకుంటున్నారు.. మేము ‘వికసిత్ భారత్’ను కోరుకుంటున్నాం… మీరు ఈ దేశాన్ని 80లు.. 90ల ఆరంభంలోకి తీసుకెళ్లాలనుకుంటే అది మీ బాధ్యత’ అని మోదీ ప్రభుత్వానికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ‘గర్వించదగ్గ భారతీయ ముస్లింగా నేను మసీదులో అంగుళం స్థలం కూడా వదులుకోను.. నా దర్గాలో ఇంచు భూమిని కోల్పోను… దీనికి నేను అనుమతించను… మేము ఇకపై ఇక్కడికి వచ్చి మెతక ప్రసంగాలు చేయం… మేము భారతీయులగా గర్విస్తున్నాం… నా సమాజం కోసం నిలబడి నిజాయితీగా మాట్లాడాల్సిన సభ ఇది.. ఇది నా ఆస్తి, ఎవరూ ఇవ్వలేదు. అని ఒవైసీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో ‘వక్ఫ్ బై యూజర్ (దీర్ఘకాలం వక్ఫ్ బోర్డు వినియోగంలో ఉండే ఆస్తి దానికే శాశ్వతంగా సంక్రమిస్తుంది. కోర్టుల్లో సవాల్ చేయడానికి వీల్లేదు)’ అనే నిబంధనను తొలగించడాన్ని ఒవైసీ వ్యతిరేకించారు.