Ananthkumar Hegde: ముస్లిం కుటుంబంపై దాడి కేసులో కర్ణాటక మాజీ ఎంపీపై కేసు

Read Time:  1 min
Ananthkumar Hegde
Ananthkumar Hegde
FONT SIZE
GET APP

అనంతకుమార్ హెగ్డేపై దాడి, కులదూషణల ఆరోపణలు – కేసు నమోదు చేసిన కర్ణాటక పోలీసులు

భాజపా మాజీ ఎంపీ, కర్ణాటక (Karnataka) నాయకుడు అనంతకుమార్ హెగ్డే (Ananthkumar Hegde) తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ముస్లిం కుటుంబంపై దాడి చేసి, కులం పేరుతో దూషించడంతోపాటు చంపుతామని బెదిరించిన ఘటనపై ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక వివాహ కార్యక్రమం ముగించుకొని తిరిగివస్తున్న సమయంలో మార్గమధ్యంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దాబస్‌పేట్ పోలీసులు హెగ్డేను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పలువురు మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. హలేనహళ్లికి చెందిన సైఫ్‌ఖాన్ నిన్న తన కుటుంబంతో కలిసి తుమకూరులో ఓ వివాహ వేడుకకు హాజరై ఇన్నోవా క్రిస్టా కారులో తిరిగి వస్తున్నారు. సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో నిజగల్ సమీపంలో తెలుపు రంగు ఎక్స్‌యూవీ 700 కారు ఒకటి వారి వాహనాన్ని అడ్డగించింది. ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారిలో ఒకరు ‘నేను డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చాను’ అని అరుస్తూ తమ కారును రోడ్డు పక్కకు ఆపమని బలవంతం చేశారని సైఫ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కులదూషణలు, మౌఖిక దాడులు – కుటుంబాన్ని చంపుతామని బెదిరింపు

దాడి సమయంలో “సాబ్రు గ్రూప్ వాళ్లు.. కొట్టండి!” అంటూ హెగ్డేనే (Ananthkumar Hegde) మిగిలిన ఇద్దరికి ప్రోత్సాహం ఇచ్చారని బాధితుడు ఆరోపించాడు. ‘సాబ్రు’ అనే పదం కర్ణాటకలో ముస్లిం సామాజిక వర్గాలను కించపరిచేందుకు ఉపయోగించే గ్రామ్య పదమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, “తక్కువ సాబ్రు కులం” అంటూ కులాన్ని దూషించే పదజాలాన్ని వాడారని ఎఫ్ఐఆర్‌లో నిక్షిప్తమైంది. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సైఫ్ తల్లి గుల్ ఉన్నీసా మెడ పట్టుకుని, బట్టలు లాగి, తలపై కొట్టి కింద పడేశారని కూడా ఆరోపణలొచ్చాయి. అలాగే, సైఫ్ మామ ఇలియాస్ ఖాన్‌ను కూడా హెగ్డే కొట్టి తీవ్ర గాయాలు చేయడం వల్ల ఆయన పళ్లు విరిగిపోయాయని తెలిపారు.

ఘటన సమయంలో హెగ్డే గన్‌మ్యాన్ తుపాకీ చూపిస్తూ కుటుంబాన్ని చంపుతామని బెదిరించినట్లు ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన బాధితులను దాబస్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యుల సమక్షంలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం, పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. హెగ్డేను ఏ1గా, ఆయన గన్‌మ్యాన్‌ను ఏ2గా, డ్రైవర్‌ను ఏ3గా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

వివరాలు వెలుగులోకి – వీడియో ఫుటేజ్ ఆధారంగా విచారణ

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌లు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. వాటిని పరిశీలిస్తున్నామని, ఆధారాల ఆధారంగా మరింత స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. “దాడికి సంబంధించిన దృశ్యాలు మా దృష్టికి వచ్చాయి. వాటి ప్రామాణికతను పరిశీలించి, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని దాబస్‌పేట్ పోలీసులు తెలిపారు. వీడియో ఆధారాలతోపాటు ప్రత్యక్ష సాక్ష్యాలున్న నేపథ్యంలో కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర స్పందిస్తూ, “హెగ్డే కారును ఓ వాహనం ఓవర్‌టేక్ చేయడంతో గొడవ మొదలైంది. ఆ తర్వాత ఆయన గన్‌మ్యాన్, డ్రైవర్ ఆ వాహనాన్ని ఆపి దాడికి పాల్పడ్డారు. అయితే, హెగ్డే స్వయంగా దాడి చేశారన్న విషయాన్ని పోలీసులు స్పష్టం చేయలేదు. విచారణ కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

Read also: Jeedimetla: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

Ramya

రచయిత గురించి

Ramya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.