హిందీ దివస్ సందర్భంగా జరిగిన అఖిల భారత అధికార భాషా సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ భాష (Hindi language)ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీని కేవలం సంభాషణలు, అధికారిక వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేయకుండా, సైన్స్, టెక్నాలజీ, న్యాయం, పోలీసు శాఖ వంటి రంగాలలో కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
“హిందీకి అన్ని రంగాల్లో స్థానం కల్పించాలి”
అమిత్ షా మాట్లాడుతూ, “హిందీ భాషకు ప్రతిభావంతులైన యువత అవసరం అన్ని రంగాల్లో ఉంది. సాంకేతిక రంగం నుంచి న్యాయ వ్యవస్థ వరకూ — హిందీ మాతృభాషగా ఉన్న ప్రజలకు అవగాహన పెరగాలంటే, వారి భాషలో సమాచార మార్పిడి అవసరం” అని పేర్కొన్నారు.

“హిందీ పోటీ కాదు – భారతీయ భాషల నేస్తం”
హిందీ ఇతర భారతీయ భాషలతో పోటీ పడేదేం కాదు, అవి అన్నీ కలిసి నడవాల్సిన అవసరం ఉందని అమిత్ షా స్పష్టం చేశారు.”భాషల మధ్య ఐక్యతే దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
మాతృభాషలో లేఖలు – మంత్రిత్వ శాఖ నుంచి అదే భాషలో సమాధానం
అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక ప్రత్యేక పిలుపు ఇచ్చారు.
తమ తమ మాతృభాషలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని, అలాగే తాను ఆ భాషలలోనే ప్రత్యుత్తరాలు ఇస్తానని హామీ ఇచ్చారు.
ప్రధాని మోదీ హిందీకి ఇచ్చిన ప్రాధాన్యం
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)నాయకత్వంలో భారతీయ భాషలకు గౌరవం పెరిగిందని, అంతర్జాతీయ వేదికలపై ఆయన హిందీలో ప్రసంగించడం భారతీయ భాషల గౌరవాన్ని పెంచిందని అమిత్ షా ప్రశంసించారు. “పంచ ప్రాణ్లో భాషకు ఉన్న ప్రాధాన్యం అనన్యసామాన్యం” అని వ్యాఖ్యానించారు.
“పిల్లలకు మాతృభాషలో విద్య ఇవ్వండి”
తల్లిదండ్రులపై పిలుపునిస్తూ, “పిల్లలు తమ మాతృభాషలో చదివితేనే విజ్ఞానం పండుతుంది. వేరే భాషలో చదివితే వారి అభ్యాస సామర్థ్యం 30% తగ్గిపోతుంది” అని హెచ్చరించారు. ‘భారతీయ భాషా అనుభాగ్’ ఏర్పాటుతో అధికార భాషా విభాగం ఇప్పుడు పూర్తిస్థాయి మంత్రిత్వ శాఖగా ఎదిగిందని అమిత్ షా తెలియజేశారు. ఇది భవిష్యత్లో భాషా విధానాలకు దిశానిర్దేశం చేస్తుందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: