

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్ ఆరోపణలతో వార్ నడుస్తున్నది.
ముఖ్యంగా కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్ మధ్య వైరం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్ ఆరోపణలతో ఈ వైరం మరింత ముదురుతోంది. తాజాగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది.
ఆచరణకు సాధ్యం కాని హామీలు
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న ఎన్నికల హామీలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఆచరణకు సాధ్యం కాని హామీలు అమలు చేస్తామని కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ హస్తం పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించేందుకు ఆప్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు కూటమి నుంచి కాంగ్రెస్ను బయటకు పంపించేలా ఇతర పార్టీలను ఒప్పించేందుకు ఆప్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.
కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేయాలన్న ప్రధాన లక్ష్యంతో సుమారు 24 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతున్నది. ఇప్పటికే కూటమిలో ఉన్న విభేదాలు లోక్సభ ఎన్నికల్లో ప్రస్ఫుటం కాగా, ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ పట్ల అందులోని పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ నాయకత్వంలో బీజేపీని ఎదుర్కోవడం కష్టమేనని, కాంగ్రెస్ను నమ్ముకుంటే తామూ మునగడం ఖాయమని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వానికి జై కొడుతున్నారు. ఇప్పటికే సమాజ్వాదీ, ఎన్సీపీ (శరద్చంద్ర పవార్), శివసేన (యూబీటీ) సహా పలు మిత్రపక్ష పార్టీలు దీదీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.