అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ సమావేశం జరిగింది.ఇందులో ముఖ్యంగా రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సమావేశానంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గతంలో 131 సంస్థలకు భూమి కేటాయించామని,వాటిలో 31 సంస్థలకు కేటాయింపులను కొనసాగిస్తున్నామని వెల్లడించారు.అంతేకాకుండా కొన్ని సంస్థలకు భూకేటాయింపులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందులో భాగంగా రెండు సంస్థలకు కేటాయించిన భూముల లొకేషన్ను మార్చినట్లు తెలిపారు.మరో 16 సంస్థలకు భూకేటాయింపు విస్తరణపై చర్చించామని, నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు.అలాగే 13 సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.అమరావతి విషయంలో మూడుకోణాల్లో రాజకీయాలు ఆడినట్లు ఆరోపించారు.

కక్షసాధింపు చర్యల కారణంగా అమరావతి అభివృద్ధి కుంటుపడిందని అయితే ప్రస్తుత ప్రభుత్వం రాజధాని అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి నారాయణ తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని సంస్థలను ఆకర్షించి, అమరావతిని వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.