Nagavali Express : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి బొబ్బిలి వైపు వస్తున్న ‘నాగావళి ఎక్స్ ప్రెస్’ పట్టాలు తప్పింది. రైల్వే స్టేషన్ సమీపంలోని వెంకటలక్ష్మీ థియేటర్ జంక్షన్ వద్ద రైలులోని చివరి రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు పట్టాలు తప్పిన రెండు బోగీలను తొలగించి.. మిగిలిన రైలును యథావిధిగా పంపించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగగపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఘటన గురించి తెలియగానే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు.. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

సాహిబ్గంజ్ జిల్లాలో మరో రైలు ప్రమాద ఘటన
మరోవైపు మంగళవారం జార్ఖండ్లోని సాహిబ్గంజ్ జిల్లాలో మరో రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సాహిబ్గంజ్లోని బర్హెట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని .. ఫరక్కా-లాల్మాటియా ఎంజిఆర్ రైల్వే లైన్లో ఒక పెద్ద రైల్వే ప్రమాదం సంభవించింది. ఫరక్కా నుంచి వస్తున్న ఖాళీ గూడ్స్ రైలు ‘బర్హెట్ ఎంటీ’ పట్టాలపై నిలబడి ఉంది. ఇంతలో లాల్మాటియా వైపు వెళ్తున్న బొగ్గుతో ఉన్న త్రూపాస్ గూడ్స్ రైలు దానిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో లోకో పైలట్తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు రైల్వే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలా రెండు రైళ్లు ఢీకొట్టాయని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.