దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసుల, భద్రతా బలగాల లక్ష్యంగా మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్నారు.కర్రెగుట్ట అటవీప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసు బలగాలపై గురువారం మావోయిస్టులు ఐఈడీ పేలుళ్లు జరిపి అనంతరం కాల్పులకు పాల్పడారు.ఈ దాడిలో ముగ్గురు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోగా, ఒక ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డాడు.దేశంలోని లోపలే దాగి ఉన్నశత్రువులు ఇలా దాడులు చేయడం భద్రతా విభాగాలను కలవరపెడుతోంది.

ఆపరేషన్ ‘కగార్’ నేపథ్యం:
ములుగు జిల్లాలోని కర్రెగుట్ట అటవీప్రాంతంలో మావోయిస్టుల ఉన్నారన్న సమాచారంతో గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలు, పోలీసులు ఆపరేషన్ కగార్ చేపట్టారు. ఇందులో భాగంగా పలువురు మావోయిస్టులను ఎన్కౌంటర్ కూడా చేశారు. అయితే తాజాగా అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బుధవారం మరోసారి ములుగు పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే దీన్ని గమనించిన మావోయిస్టులు పోలీసులు, భద్రతా బలగాల లక్ష్యంగా ఆ ప్రాంతాల్లో మందు పాత్రలు పేల్చారు. ఇక ఈ క్రమంలోనే బలగాలపై కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు వడ్ల శ్రీధర్, సందీప్, ఎన్.పవన్కల్యాణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మరో ఆర్ఎస్ఐ అధికారి రణధీర్కు తీవ్రంగా గాయపడ్డారు.
అమరులైన గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు
ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కానిస్టేబుళ్లు – వడ్ల శ్రీధర్ (29), సందీప్ (27), ఎన్. పవన్కల్యాణ్ వీరిలో సందీప్ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్కు చెందినవాడు కాగా, 2018లో గ్రేహౌండ్స్లో చేరాడు. అతను 2022లో వివాహం చేసుకున్నాడు. వడ్ల శ్రీధర్ కామారెడ్డి జిల్లా పల్వంచకు చెందినవాడు. ఇతనూ ఇటీవలే వివాహం చేసుకుని కుటుంబంతో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నాడు. పవన్కల్యాణ్ ప్రకాశం జిల్లా కొత్తముద్దపాడుకు చెందినవాడు. వారి కుటుంబం గత 25 ఏళ్లుగా హైదరాబాద్లో జీవనం సాగిస్తోంది.
మృతదేహాలను వరంగల్ ఎంజీఎంకు తరలించిన అధికారులు
దాడిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుళ్ల మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వీరి మృతదేహాలను పోలీసు హెడ్క్వార్టర్కు తీసుకెళ్లి అధికారికంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం, పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క, డీజీపీ జితేందర్ రెడ్డి నివాళులు
అమరులైన కానిస్టేబుళ్లకు తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క, డీజీపీ డా. జితేందర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వీరితో పాటు వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్, ములుగు ఎస్పీ శబరీష్, స్థానిక ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత కానిస్టేబుళ్ల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆవేదన నెలకొంది.
Read also: Maoists: ములుగు అడవుల్లో ముగ్గురు పోలీసులను బలిగొన్న మావోయిస్టులు