సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినిమాలతోనే కాకుండా తన మానవతా సేవతో కూడా ఎంతో మంది అభిమానులను గెలుచుకుంటున్నారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం మహేశ్ బాబు ఫౌండేషన్ ప్రత్యేకంగా పని చేస్తోంది.గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ,ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోంది.ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 4,500కు పైగా చిన్నారులు ఉచితంగా గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు.ఈ వివరాలను ఆంధ్రా హాస్పిటల్స్ తాజాగా వెల్లడించింది.

పుట్టుకతో గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా చికిత్స అందించేందుకు మహేశ్ బాబు ఫౌండేషన్ ఎంతో కృషి చేస్తోంది. తండ్రి కృష్ణ గారి మార్గదర్శనాన్ని అనుసరిస్తూ, సమాజానికి సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్న మహేశ్ బాబు, గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమానికి అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
నమ్రతా శిరోద్కర్ గర్భాశయ క్యాన్సర్ టీకా పంపిణీకి
ఇక మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండి నడుస్తున్నారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో మదర్స్ మిల్క్ బ్యాంక్ను ప్రారంభించారు. ఇక బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం ఉచితంగా టీకా అందించే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టారు. మహేశ్ బాబు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని గమనించిన అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. మన హీరో రియల్ హీరో అంటూ ఆయన సేవలను కొనియాడుతున్నారు. సినిమాల్లో మాత్రమే కాదు, నిజమైన జీవితంలో కూడా మహేశ్ ఒక రియల్ హీరో అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.