ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ… రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ డాక్టర్ పి.వి.ఎన్. మాధవ్ మంగళవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరిగిన విషయం తెలిసిందే.భేటీ సందర్భంగా పవన్ కల్యాణ్ మాధవ్ (Madhav)ను శాలువాతో సత్కరించారు. బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది కేవలం అభినందనలు తెలిపే సమావేశంగా కాకుండా, రెండు పార్టీల మధ్య సంబంధాల బలోపేతానికి దారితీసే చర్చల వేదికగా నిలిచింది.

కూటమి అధికారంపై చర్చ
ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్డీఏ కూటమిలోని పార్టీలు—జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం, అధికార భాగస్వామ్యం, కార్యాచరణపై చర్చ జరిగింది. భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కూడా వారి మధ్య విస్తృతంగా చర్చలు జరిగినట్టు సమాచారం.
మాధవ్కు బీజేపీలో విశ్వాసం
విజయవాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాధవ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవికి ఆయన ఏకైక అభ్యర్థిగా నామినేషన్ వేసినందున ఎన్నిక ఏకగ్రీవమైంది. గతంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, శాసనమండలిలో పార్టీ నేతగా పని చేసిన మాధవ్, ఆర్ఎస్ఎస్, బీజేవైఎం అనుభవంతో పార్టీకి నూతన దిశ చూపే నేతగా అభివృద్ధి చెందారు.
సమన్వయమే లక్ష్యం
మాధవ్ పవన్ కల్యాణ్ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కూటమిలో ఒకరిపై ఒకరు నమ్మకంతో ముందుకు సాగేందుకు ఈ సమావేశం దోహదం చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో జనసేన–బీజేపీ–టీడీపీ కూటమి మరింత సమర్థవంతంగా పనిచేయనుంది.
Read Also : Amit Shah : రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక ఏం చేస్తానంటే?: అమిత్ షా