ఈ వారం మొదటి రోజున అంటే సోమవారం ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీ క్షీణతను చూస్తోంది. ఉదయం 9:16 గంటలకు బిఎస్ఇ సెన్సెక్స్ 3,072 పాయింట్లు లేదా 4.09% తగ్గి 72,296 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 50 కూడా 1,146 పాయింట్లు లేదా 5% తగ్గి 21,758 వద్దకు చేరుకుంది. ఈ పతనం కారణంగా BSEలో లిస్ట్ చేసిన అన్ని కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.19.4 లక్షల కోట్లు తగ్గి రూ.383.95 లక్షల కోట్లకు చేరుకుంది. దాదాపు అన్ని సెక్టార్లలో క్షీణత స్పష్టంగా కనిపిస్తుంది.
భారీ క్షీణతలు
నిఫ్టీ మెటల్ 8% పైగా, నిఫ్టీ ఐటీ 7% పైగా పడిపోయాయి. నిఫ్టీ ఆటో, రియాల్టీ, ఆయిల్ & గ్యాస్ కూడా 5% పైగా క్షీణించాయి. చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లు కూడా భారీగా పడిపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 10%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 7.3% పడిపోయాయి. ఇతర ఆసియా మార్కెట్లు కూడా తీవ్ర క్షిణించగా, 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత హాంకాంగ్లోని హాంగ్ సెంగ్ ఒక్కరోజులో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. చైనా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ దక్షిణ కొరియాలలో కూడా భారీ క్షీణతలు సంభవించాయి.

భారీగా పతనమైన నాస్డాక్
గత శుక్రవారం నాస్డాక్ ఇండెక్స్ భారీగా పడిపోయింది. అయితే ఇటీవలి గరిష్ట స్థాయి నుండి 20% కంటే పైగా కుప్పకూలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దీ రోజుల క్రితం దిగుమతులపై భారీ సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. ఈ తరుణంలో 60కి పైగా దేశాలపై పరస్పర సుంకాలు విధించారు. దీని వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందనే భయాలు వ్యాపించాయి. సుంకాల వార్తలతో పెట్టుబడిదారులు కూడా షాక్ అయ్యారు అలాగే షేర్స్ అమ్మడం ప్రారంభించారు. ఈ పన్నులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఆర్థిక వృద్ధి మందగించవచ్చని ఆయన హెచ్చరించారు. దీని వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి కూడా పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో క్షీణత
ప్రపంచ స్టాక్ మార్కెట్లలాగానే భారత స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది. ఆసియాలోని చాలా మార్కెట్లు క్షీణతను చూశాయి. జపాన్ నిక్కీ 7%, దక్షిణ కొరియా కోస్పి 5%, చైనా బ్లూ-చిప్ ఇండెక్స్ దాదాపు 7% పడిపోయాయి. హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 10.5% కంటే పైగా పడిపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్ కూడా క్షీణించే ప్రమాదం ఉంది. నాస్డాక్ ఫ్యూచర్స్ 4%, ఎస్ అండ్ పి 500 ఫ్యూచర్స్ 3.1% తగ్గాయి. యూరోపియన్ మార్కెట్లలో కూడా క్షీణత కనిపించింది.
ద్రవ్యోల్బణం కంటే పెరుగుతున్న మాంద్యం భయం
ఇప్పుడు ప్రజలు ద్రవ్యోల్బణం కంటే మాంద్యం గురించే ఎక్కువగా భయపడుతున్నారని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికాలో మార్చి నెలకు సంబంధించిన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) డేటా రాబోతోంది. దీనికి సంబంధించి 0.3% పెరుగుదల ఉంటుందని అంచనా. కానీ పన్ను కారణంగా ఆహార పదార్థాల నుండి కార్ల వరకు ప్రతిదీ ఖరీదైనదిగా మారుతుందని ప్రజలు భయపడుతున్నారు. కంపెనీలు కూడా ఆదాయాలు తగ్గుతాయని భయపడుతున్నాయి. దాదాపు 87% US కంపెనీలు ఏప్రిల్ 11 నుండి మే 9 మధ్య తమ ఫలితాలను ప్రకటించనున్నాయి. అయితే ముందుగా పెద్ద బ్యాంకులు వారి ఫలితాలను ప్రకటిస్తాయి.