ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ పరిపాలనలో సీఎం రేవంత్ ఒత్తిడి కారణంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సహా అనేక ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి నచ్చిన అధికారులే నిలబడగలరన్న అభిప్రాయం పాలనను తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్నారు.

కేటీఆర్ ప్రకారం, గత నాలుగు నెలల పాలనలో ఇప్పటికే ఐఏఎస్ అధికారులు, అటవీ శాఖ అధికారులు ప్రభుత్వం ఒత్తిడికి లోనై దెబ్బతింటున్నారని అన్నారు. ఇంకా ఎన్ని శాఖల అధికారులు ఇలా బలయ్యారో ప్రజలకు తెలీదు. అధికారుల స్వేచ్ఛను హరించి, సొంత విధానాలను రుద్దడం ప్రబలంగా మారింది, అని విమర్శించారు. చట్టపరంగా తమ విధులు నిర్వర్తించాల్సిన అధికారులపై రాజకీయం ముసురుకుంటుందన్నది ఆయన ప్రధాన అభియోగం.
పోలీసులపై తీవ్ర విమర్శలు
కేటీఆర్ మాట్లాడుతూ, కొంతమంది పోలీసులు సీఎం రేవంత్ కు ప్రైవేట్ సైన్యంలా పని చేస్తున్నారు. ఆ పోలీసుల తీరును చూస్తే ప్రజాస్వామ్యంలో ఇది ఎంత ప్రమాదకరమో అర్థం అవుతుంది, అని అన్నారు. సీఎం సూచనలతోనే కేసులు నమోదు అవుతున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేసులు పెట్టడమేనా పోలీసుల పని? కక్షపూరితంగా వ్యవహరిస్తే వాళ్లని కోర్టులో లాగుతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకెళ్తాం, అని స్పష్టంగా చెప్పారు. ప్రత్యేకంగా కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు ఎండగట్టిందన్నారు. ప్రజాస్వామ్యంలో భూముల పంపిణీ వంటి అంశాలు పారదర్శకంగా జరగాలని, కానీ తెలంగాణలో అది గల్లంతవుతోందని అన్నారు.
Read also: Shravan Rao : నాలుగవసారి సిట్ ఎదుట విచారణకు హాజరు