ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించేందుకు గ్యారెంటీల పేరిట పెద్దఎత్తున హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆర్థికంగా ఇబ్బందిపడుతోంది. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వ పథకాల అమలు మరింత ఆలస్యమవుతోంది.దీంతో లబ్ధిదారులకు పథకాల బకాయిలు పెరిగిపోతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ప్రణాళిక విభాగం తాజా నివేదిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బహిర్గతం చేసింది. 2024-25కు గానూ ప్రభుత్వం రూ.3.71 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024 డిసెంబర్ చివరి నాటికి ఇందులో 3.31 లక్షల కోట్లు కేటాయించింది. అయితే, విడుదల చేసినవి మాత్రం కేవలం రూ.2.03 లక్షల కోట్లే. ఇందులో ఖర్చు చేసినవి రూ.1.89 కోట్లు మాత్రమే. కేటాయింపులు, నిధుల విడుదలకు మధ్య రూ.1.28 లక్షల కోట్లు(61.3 శాతం) తేడా ఉండటం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నది.

అందని గ్యారెంటీలు
నిధుల కొరత కారణంగా గ్యారెంటీలు సరిగ్గా అమలు కావడం లేదు. మహిళలకు నెలకు రూ.2000 ఇచ్చే గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మూడు నెలలుగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జనవరి 31 నాటికి గృహలక్ష్మి బకాయిలు రూ.7,517 కోట్లు ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. రేషన్కార్డుదారులకు ప్రభుత్వం అన్నభాగ్య పథకం కింద ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం ఇవ్వాలి. ఇందులో కేంద్రం 5 కిలోలు, రాష్ట్రం 5 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. బియ్యం కొరత కారణంగా కేజీకి రూ.34 చొప్పున డబ్బులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, 5 నెలలుగా లబ్ధిదారులకు ఈ డబ్బులు ఇవ్వడం లేదని తెలుస్తున్నది.
బెంగళూరు రోడ్ల పరిస్థితిపై డీకే శివకుమార్ వ్యాఖ్యలు
బెంగళూరులో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను బాగు చేయడం భగవంతుడికి కూడా కష్టమేనని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘భగవంతుడు స్వర్గం నుంచి దిగివచ్చి బెంగళూరు వీధుల్లో నడిచినా రెండుమూడేండ్లలో ఏమీ మారదు. పరిస్థితి చాలా క్లిష్టంగా మారుతున్నది. మనం సరైన ప్రణాళికతో ప్రాజెక్టులను సమర్థంగా అమలు చేయాలి. భవిష్యత్తు కోసం మంచి కారిడార్ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, బెంగళూరు రోడ్లపై 96 శాతం గుంతలను పూడ్చేశామని ఏడాది క్రితం అసెంబ్లీ సాక్షిగా డీకే శివకుమార్ ప్రకటించడం గమనార్హం.
బెంగళూరులో నీటి సంక్షోభం
ఐటీ హబ్గా పేరుగాంచిన బెంగళూరు ఇప్పుడు తీవ్రమైన నీటి కొరత సమస్యను ఎదుర్కొంటోంది. నగర జనాభా పెరుగుతున్న కొద్దీ నీటి వనరులపై భారం పెరిగిపోతోంది.నీటి సరఫరా పూర్తిగా నిలకడగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.