ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఈ సారి అద్భుతంగా ఆడుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్స్లో కూడా తన స్థానాన్ని దాదాపుగా నిర్ధారించుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. ప్రస్తుతం ఆర్సీబీ 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, మిస్టర్ 360, ఆర్సీబీ గ్రేట్ ఏబీ డివిలియర్స్(AB deVilliers) మాట్లాడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్కు చేరుకుంటే తాను కచ్చితంగా భారత్కు వస్తానని చెప్పాడు. ఐపీఎల్ ఫైనల్ జూన్ 3న జరగనుంది. ప్లేఆఫ్స్ మే 29 నుంచి ప్రారంభమవుతాయి. క్వాలిఫయర్ 1, ఎలిమిటర్ వరుసగా మే 29, 30 తేదీలలో జరుగుతాయి. క్వాలిఫయర్ 2 జూన్ 1న జరగనుంది. ప్లేఆఫ్స్ స్థానాలు ఇంకా నిర్ణయించబడలేదు.ఏబీ డివిలియర్స్ ఐపీఎల్లో 11 సంవత్సరాలు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. ఏబీ డివిలియర్స్ 2011 నుంచి 2021 వరకు ఆర్సీబీ జట్టు తరఫున ఆడాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) ఏబీడీకి ఎన్నో చిరస్మరణీయ పార్టనర్ షిప్లు ఉన్నాయి. ఒకప్పుడు ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి ప్రమాదకరమైన బ్యాటర్లు ఉండేవారు. ఇప్పుడు కూడా కోహ్లీ ఆర్సీబీ జట్టులోనే ఉన్నాడు. అయితే దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఒక్కసారి కూడా ఆర్సీబీ తరఫున ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శనను చూసి తన సన్నిహితుడు విరాట్ కోహ్లీతో కలిసి ఐపీఎల్ ట్రోఫీని ఎత్తాలని కోరుకుంటున్నానని ఏబీ డివిలియర్స్ అన్నాడు. కాబట్టి ఆర్సీబీ ఫైనల్కు చేరుకుంటే ఏబీ డివిలియర్స్ ఖచ్చితంగా ఇండియాకు వస్తాడు.
ఆనందం
నా మాటలను గుర్తుంచుకోండి, ఆర్సీబీ ఫైనల్కు చేరుకుంటే, నేను జట్టుతో కలిసి స్టేడియంలో ఉంటాను’అని ఏబీ డివిలియర్స్ ఇన్స్టాగ్రామ్ లైవ్(Instagram Live)లోఈ సందర్భంగా అన్నాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఐపీఎల్ ట్రోఫీని ఎత్తడం కంటే అంతకు మించిన ఆనందం మరొకటి లేదని, తాను చాలా సంవత్సరాలుగా దీని గురించి ప్రయత్నిస్తున్నానని ఏబీడీ వ్యాఖ్యానించాడు.
Read Also : Sports: ధోనీకి మాత్రమే నిజమైన అభిమానులు ఉన్నారు:హర్భజన్ సింగ్