అమెరికా సంయుక్త రాష్ట్రాలు వలస విధానాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల పౌరులపై ఆంక్షలు విధించిన అగ్రరాజ్యం తాజాగా నేపాల్ దేశస్థులపై దృష్టి సారించింది. సుమారు 82 శాతం హిందూ జనాభా కలిగిన నేపాల్కు గతంలో కల్పించిన తాత్కాలిక రక్షణ హోదా (టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్-టీపీఎస్)ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రద్దు చేశారు. ఈ నిర్ణయంతో అమెరికాలో నివసిస్తున్న దాదాపు 7,500 మంది నేపాల్ జాతీయులు తక్షణమే స్వదేశానికి తిరిగి రావలసిన పరిస్థితి ఏర్పడింది. 2015లో నేపాల్ను భారీ భూకంపం కుదిపేసినప్పుడు అక్కడి పౌరులకు మానవతా దృక్పథంతో అమెరికా టీపీఎస్ను మంజూరు చేసింది. దీని ద్వారా నేపాలీలు అమెరికాలో తాత్కాలికంగా నివసించడానికి, చట్టబద్ధంగా పనిచేసుకోవడానికి వీలు కలిగింది. అయితే, 2015 నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం నేపాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అందుకే టీపీఎస్(Tps)ను కొనసాగించాల్సిన అవసరం లేదని అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది. టీపీఎస్ (Tps)అనేది కేవలం తాత్కాలిక ఉపశమన చర్య మాత్రమేనని, ఇది పౌరసత్వం కల్పించదని, కేవలం పరిమిత కాలానికి పని చేసుకునే హక్కులను మాత్రమే ఇస్తుందని గమనించాలి. సాయుధ ఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశాల పౌరులకు అమెరికా ఈ హోదాను కల్పిస్తుంటుంది.

నేపాలీ వలసదారుల భవిష్యత్తు
ప్రస్తుతం అమెరికాలో టీపీఎస్ కింద సుమారు 7,500 మంది నేపాల్ పౌరులు నివసిస్తున్నారు. తాజా నిర్ణయంతో వారంతా వెంటనే అమెరికాను విడిచిపెట్టాల్సి ఉంటుంది. లేదంటే బలవంతంగా వెనక్కి పంపించే ప్రమాదం ఉంది. ఈ పరిణామం నేపాల్ సమాజంలో తీవ్ర ఆందోళనలకు దారితీసింది, వారి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి, ట్రంప్ 2017లో అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే నేపాల్ టీపీఎస్ను రద్దు చేయడానికి ప్రయత్నించారు. కానీ, అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వ్యతిరేకత రావడంతో అప్పుడు ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు మాత్రం నేపాల్లో పరిస్థితులు చక్కబడ్డాయని, టీపీఎస్ (Tps) పొడిగింపునకు కారణాలు లేవని ప్రస్తుత ప్రభుత్వం వాదిస్తోంది.
ఇతర దేశాలపై ప్రభావం
నేపాల్పై ఈ నిర్ణయం వెలువడటానికి కేవలం రెండు రోజుల ముందు, ఉగ్రవాద కార్యకలాపాలను కారణంగా చూపుతూ ట్రంప్ ప్రభుత్వం 12 దేశాల పౌరులపై కఠిన ఆంక్షలు విధించింది. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ వంటి కొన్ని దేశాలు ఇంకా దీనిపై స్పందించనప్పటికీ, చాద్ మాత్రం తీవ్రంగా ప్రతిస్పందించింది. అమెరికా పౌరులు తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. అమెరికా కోసం తమ గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టబోమని చాద్ నేత స్పష్టం చేశారు. ఈ దౌత్యపరమైన ఉద్రిక్తతల్లో భాగంగా ఖతార్ నుంచి అందిన వివాదాస్పద బహుమతిని కూడా ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. ఈ తాజా చర్యలు అమెరికా వలస విధానాలు మరింత కఠినతరం అవుతున్నాయనడానికి సంకేతంగా నిలుస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న ఈ చర్యలు వలసదారుల భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. వలస విధానాల పేరుతో బలహీన దేశాలను లక్ష్యంగా చేసుకోవడమేనా? లేదా జాతీయ భద్రత, అంతర్గత చట్టాల పరిరక్షణ అనే దృక్పథమే ఆధారమా? అనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్న ఈ విధానాలు ఇప్పుడు హిందూ మెజారిటీ దేశమైన నేపాల్కూ విస్తరించడం గమనార్హం. ఈ కఠిన వాస్తవికతపై నేపాల్, అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తాయో చూడాలి.
Read Also: Raipur: అమ్మాయిలపై పోకిరీల దాడి రంగంలోకి దిగిన పోలీసులు