ప్రపంచ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు అమెరికా(America) చర్చలు జరుపుతున్న వేళ భారత్, చైనా(India-china) ఉద్దేశించి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక ప్రకటన చేశారు. అమెరికా, చైనాతో కీలక వాణిజ్య ఒప్పందం(Trade Deal) కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. అలాగే, భారత్తో కూడా ‘చాలా పెద్ద’ ఒప్పందం త్వరలోనే కుదరొచ్చని ఆయన సంకేతం ఇచ్చారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో, విలేకరులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానం ఇచ్చారు.
భారత్తో కూడా ఒప్పందం
“ప్రతి ఒక్కరికీ మా ఒప్పందాల్లో భాగం కావాలనిపిస్తుంది. మేము నిన్నే చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇప్పుడు చాలా గొప్ప ఒప్పందాలు జరుగుతున్నాయి. భారత్తో కూడి ఒకటి రాబోతుంది. ఇది చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ ఒప్పందంతో భారత్ను ఓపెన్ చేయబోతున్నాం. అలాగే చైనా ఒప్పందంలో కూడా మేము చైనా మార్కెట్ను ఓపెన్ చేయడం మొదలుపెట్టాం” అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఆ దేశాలకు నో ఛాన్స్
అన్ని దేశాలతో తాము వాణిజ్య ఒప్పందాలు చేసుకోమని ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కొన్ని దేశాలకు తాము విధించే పన్ను శాతాన్ని లేఖ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ‘మీరు 25శాతం, 35శాతం, లేదా 45శాతం పన్ను చెల్లించండి’ అని లేఖలో కొన్ని దేశాలకు తెలియజేయాలని అనుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇదే తేలికైన మార్గంగా ట్రంప్ చెప్పుకొచ్చారు. “అన్ని దేశాలతో ఒప్పందాలు చేయం. కొన్ని దేశాలకు పన్ను శాతం లేఖ ద్వారా తెలియజేస్తాం.” ఈ వ్యాఖ్యల ద్వారా అమెరికా కఠిన వాణిజ్య విధానాన్ని కొనసాగించబోతుందని సంకేతాలు ఇచ్చారు.
అమెరికాకు చైనా అరుదైన ఖనిజాలు
చైనాతో కుదిరిన ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలపై ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. గతంలో జెనీవాలో అంగీకరించిన అంశాల ఆధారంగా ఈ ఒప్పందం జరిగి ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
చైనాతో ఒప్పందంపై ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్ సోషల్ ట్రూత్ వేదికగా కూడా స్పందించారు. చైనాతో ఒప్పందం పూర్తయిందని పేర్కొన్నారు. చైనా- మాగ్నెట్లు, అరుదైన ఖనిజాలను అమెరికాకు సరఫరా చేస్తుందని వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించే దిశగా ఉండడం కాక, భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచనుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇండియా విషయానికి వస్తే
భారత్తో అమెరికా ఒప్పందంపై ఈ నెల 10న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ ఫిబ్రవరిలో కలుసుకున్నారని, రెండు దేశాలు పరస్పర లాభదాయకమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా చర్చలు జరుపుతున్నాయని వెల్లడించారు. ‘ఈ ఒప్పందం ఇరుదేశాల వ్యాపార, వ్యాణిజ్యాలకు, ప్రజలకు లాభం చేకూర్చేలా ఉంటుంది’ అని గోయల్ వివరించారు.
అంతకు ముందు జరిగిన భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్లో యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లట్నిక్ స్పందించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశముందని చెప్పారు. మొత్తంగా, ఈ ఒప్పందం ద్వైపాక్షిక వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచే దిశగా తీసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాతో ఒప్పందాన్ని ప్రకటించిన వెంటనే భారత్ను ఉద్దేశించి ట్రంప్ చేసిన హింట్లు, భవిష్యత్తులో భారత్-అమెరికా సంబంధాలు కొత్త దిశలోకి వెళ్తాయని సంకేతాలు ఇస్తున్నాయి. వాణిజ్య పరంగా ఇది ఆర్థికంగా, వ్యూహాత్మకంగా కీలక మలుపు కావచ్చు.
Read Also: Pakistan: ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత గూఢచారి సమాచారం చైనా నుంచి వచ్చింది: పాక్