యూఎస్, భారత్ మధ్య వాణిజ్య సుంకాలపై చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందన్నారు. వైట్హౌస్ వద్ద విలేకరులతో సమావేశంలో సుంకాలు, భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్.
భారత్తో కొనసాగుతున్న చర్చలు
“భారత్తో సుంకాల చర్చలు బాగా జరుగుతున్నాయి. ఇండియాతో వాణిజ్య ఒప్పందం ఉంటుందని భావిస్తున్నాను. భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు వారాల క్రితం అమెరికాకు వచ్చారు. ఆ సమయంలో సుంకాలపై ఒక ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏమి జరుగుతుందో చూద్దాం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
టారిఫ్ చర్చల్లో పురోగతి
మరోవైపు, భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పందించారు. ఇరుదేశాల మధ్య టారిఫ్ చర్చల్లో పురోగతి కనిపిస్తోందని తెలిపారు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి కుదుర్చుకోవడానికి అమెరికా చాలా దగ్గరగా ఉందన్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ప్రధాని మోదీతో వాణిజ్య చర్చలు జరిగాయని పేర్కొన్నారు. దీనిపై త్వరలో దిల్లీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా వంటి సానుకూలమైన దేశాలతో చర్చలు జరపడం సులభమని కొనియాడారు.
అమెరికా- ఇండియా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన తర్వాత అమెరికా- ఇండియా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి లభించిందని వాన్స్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. చర్చల కోసం నిబంధనలను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి ఆర్థిక ప్రాధాన్యతల గురించి మరిన్ని చర్చలకు రోడ్ మ్యాప్ను కూడా నిర్దేశించింది. పరస్పర ప్రయోజనకరమైన రీతిలో ద్వైపాక్షిక వాణిజ్యంపై చర్చలు జరుగుతాయని వెల్లడించింది.
భారత్ మాత్రం ఆచితూచీ వ్యవహరించింది
ఏప్రిల్ ప్రారంభంలో ట్రంప్ పలు దేశాలపై టారిఫ్ల మోత మోగించారు. అయితే 90 రోజుల పాటు ఈ సుంకాల అమలుకు అమెరికా బ్రేక్ ఇచ్చింది. ట్రంప్ విధించిన సుంకాలపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు దిగాయి. అయితే, భారత్ మాత్రం ఆచితూచీ వ్యవహరించింది. ప్రతీకార సుంకాలకు బదులుగా అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి పెట్టింది.
ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడ్డాయి. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా దేశాధినేతలు అంగీకారం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే చర్చలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్హౌస్ విలేకరులతో మాట్లాడుతూ, భారత్తో వాణిజ్య సుంకాలపై చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. త్వరలోనే ఓ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ ఒప్పందం కేవలం సుంకాలపై మాత్రమే కాకుండా, భారత్-అమెరికా మధ్య వ్యాపార, పెట్టుబడి, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో సుదీర్ఘమైన భాగస్వామ్యానికి బీజం వేసే అవకాశముంది.
Read Also: Swedon: స్వీడన్లో పేలిన తుపాకీలు.. ముగ్గురు మృతి!