కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)తో సహా వివిధ పార్టీలు బుధవారం బంద్, నిరసనకు పిలుపునిచ్చాయి.దీంతో జమ్మూ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.
దేశాధి నేతలు
ఈ దాడి తీవ్ర కలతపెట్టిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాశ్మీర్ నుంచి వస్తున్న వార్తలు తీవ్ర కలతపెట్టేవిగా ఉన్నాయన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంతో అమెరికా బలంగా నిలుస్తుంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి మోదీకి, భారత్కు పూర్తి మద్దతు ఇస్తామన్నారు, అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ట్రంప్ ఈ దాడిని ఖండించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఉగ్రవాద దాడిని ఖండించారు. భారత్కు అండగా నిలిచారు. ఈ ఘటనకు కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కూడా ఈ దాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పహల్గామ్లో జరిగిన వినాశకరమైన ఉగ్రవాద దాడి బాధితులకు సంతాపాన్ని తెలియజేశారు.
అధికారిక పర్యటన
కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించిన మొదటి దేశాలలో ఇజ్రాయెల్ ఒకటి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు ఇజ్రాయెల్ మద్దతుగా నిలుస్తుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఉగ్రదాడి జరిగిన సమయంలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనను రద్దు చేసుకుని బుధవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సైతం విచారాన్ని వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా భారత్కి అండగా ఉంటుందని, ఈ దుఃఖ సమయంలో అవసరమైన సహాయాన్ని అందిస్తుందని అన్నారు. ఇక ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Read Also: Saifulla Sajid Jutt: పహల్గామ్ దాడికి సూత్రధారి సైఫుల్లా సాజిద్ జుట్?