అంబానీ నుంచి అదానీ వరకూ… టాటా నుంచి బిర్లా దాకా.. జిందాల్ నుంచి సందులో ఉండే చిన్న మైక్రో క్యాప్ కంపెనీ వరకూ.. సోమవారం నెలకొన్న మార్కెట్ల పతనం ఎవ్వరినీ వదల్లేదు. దశాబ్దాల చరిత్ర ఉన్నా, అత్యంత పటిష్టమైన నాయకత్వం ఉన్నా, ఏదీ కంపెనీలను నష్టాల నుంచి కాపాడలేకపోయింది. స్టాక్ మార్కెట్లో సోమవారం ఒక బ్లాక్ మండే. చరిత్రలో నిలిచిన అతి భారీ పతనాల్లో ఇది కూడా ఒకటి. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సుంకాల విధింపు తర్వాత జరుగుతున్న పరిణామాల్లో భాగంగా ఈ వారం ప్రారంభంలోనే ప్రపంచ మార్కెట్లతో సహా భారతీయ మార్కెట్లు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాస్తవానికి యూఎస్, యూరప్, ఏషియా మార్కెట్లలోని సూచీలతో పోలిస్తే భారతీయ మార్కెట్లు కాస్త మెచ్యూర్డ్గా, షాక్ను గట్టిగా తట్టుకున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే హాంకాంగ్ మార్కెట్స్ ఏకంగా 13.2 శాతం, చైనా షాంఘై ఇండెక్స్ 7.3 శాతం, జపాన్ నిక్కీ 7.8 శాతం నష్టపోగా, నిఫ్టీ మాత్రం 3.2 శాతమే నష్టపోయింది. సోమవారం నష్టాల దెబ్బకు బీఎస్ఈలో సుమారుగా రూ.13 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయింది. సెన్సెక్స్ 2,226 పాయింట్లు, నిఫ్టీ 742 పాయింట్ల నష్టాలతో ముగిశాయి.
టాటా, అంబానీ కూడా మినహాయింపు కాదు
సోమవారం ట్రేడింగ్లో నిఫ్టీ50లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ కంపెనీల స్టాక్స్ టాప్ లూజర్స్. ఈ ఐదు స్టాక్సే సుమారు 320 పాయింట్ల నెగిటివ్ కంట్రిబ్యూషన్ చేశాయి. అంటే, నిఫ్టీ 750 పాయింట్ల పతనంలో 320 పాయింట్ల పతనం ఈ టాప్ ఐదు స్టాక్స్ వల్లే. టాటా గ్రూప్ సోమవారం ట్రేడింగ్లో సుమారు రూ.లక్షన్నర కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయింది. ముఖ్యంగా టాటా మోటార్స్ స్టాక్ 10 శాతం కుప్పకూలింది.
ఉత్పత్తులను యూఎస్కు పంపడాన్ని తాత్కాలికంగా నిలిపివేత
ఎందుకంటే టాటా మోటార్స్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ సుంకాల దెబ్బకు భయపడి ప్రస్తుతానికి తన ఉత్పత్తులను యూఎస్కు పంపడాన్ని తాత్కాలికంగా నిలిపేసింది. ఇదే కోవలో టాటా స్టీల్, టీసీఎస్, ట్రెంట్, ఇండియన్ హోటల్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా పవర్ కూడా నష్టాలను చవిచూశాయి.
ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక దశలో ఇంట్రాడేలో 7.5శాతం కోల్పోయి 52వారాల కనిష్ట స్థాయిని తాకింది. ఏడాది కాలంలో రిలయన్స్ 22 శాతం నష్టాలను చవిచూసింది.
ట్రంప్ సుంకాలు – పరస్పర సుంకాలు (రెసిప్రోకల్ టారిఫ్స్)
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2వ తేదీ సుంకాల ప్రకటన చేసినప్పటి నుంచి మార్కెట్లలో తీవ్రత మరింతగా పెరిగింది. 180 దేశాల మీద ఆయన సుంకాలు విధించడం పరోక్షంగా అమెరికా ఆర్థిక స్థితిగతులపైనే నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందనేది మెజారిటీ ఆర్థికవేత్తలు చెబుతున్న మాట. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ కూడా అదే చెబుతున్నారు.
రొయ్యల నుంచి ఐటీ ఉద్యోగాల వరకూ..
అమెరికాలో మాంద్యం వస్తే మనకేంటి? స్టాక్ మార్కెట్ నష్టపోతే మనకు ఏంటి? అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవన్నీ మనందరిపై ఖచ్చితమైన ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు.. ఐటీ రంగాన్నే తీసుకుందాం. ఒకవేళ యూఎస్లో ఏదైనా మాంద్యంలాంటి పరిస్థితులు వస్తే, కంపెనీలన్నీ మెల్లిగా తమ ఖర్చులను తగ్గించుకుంటాయి. ఆ సమయంలో వాళ్లు ఆర్డర్లను కూడా తగ్గిస్తారు. భారతదేశంలో మెజార్టీ ఐటీ సంస్థలు యూఎస్ ఆర్డర్స్పై ఆధారపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉద్యోగాల్లో కోత ఉంటుంది. ఇప్పటికే కొత్త నియామకాలు దాదాపుగా ఆగిపోయాయి.