లక్షల మంది శరణార్థులు బంగ్లాదేశ్లోని కాక్సస్ బజార్లో వెదురు బొంగులు, టార్పాలిన్ పట్టాలతో వేసిన తాత్కాలిక టెంట్లలో జీవిస్తున్నారు. ఏడు నెలల కిందట, మయన్మార్ లోని మౌంగ్డా ప్రాంతంలో ఉన్న సొంత ఇంటిని వదిలేసి ఇస్మత్ అరా తన కుటుంబంతో సహా బంగ్లాదేశ్కు పారిపోవాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎక్కువగా హింసను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితి చెబుతున్న రోహింజ్యా కమ్యూనిటీకి చెందినవారు ఇస్మత్ అరా. ఈ కమ్యూనిటీలో ఎక్కువమంది ముస్లింలు. ఆమె ప్రస్తుతం కాక్సస్ బజారులో ఏర్పాటు చేసిన 34 క్యాంపుల్లోని ఓ క్యాంపులో ఉంటున్నారు. బంగ్లాదేశ్లోని ఈ ప్రాంతం పది లక్షల మందికి పైగా శరణార్థులకు ఆశ్రయం ఇస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద శరణార్థి శిబిరమని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. 2021లో సైన్యం మయన్మార్ లో అధికారాన్ని చేపట్టింది. ఆ తర్వాత దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. వాస్తవానికి రఖైన్ రాష్ట్రంలోని రోహింజ్యాలు కొన్ని దశాబ్దాలుగా అణచివేత, హింసను ఎదుర్కొంటున్నారు.
2016 అక్టోబర్లో ‘అరాకన్ రోహింజ్యా సాల్వేషన్ ఆర్మీ’ పేరుతో ఏర్పాటైన ఒక టెర్రరిస్టు గ్రూపు, ఈ ప్రాంతంలోని కొన్ని పోలీస్ కేంద్రాల మీద దాడి చేసింది. 9 మంది అధికారులను చంపేసింది. దీనికి స్పందించిన సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది. ఈ సమయంలో మయన్మార్ సైన్యం హత్యలు, అత్యాచారాలు, చిత్రహింసలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. తాము తీవ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకున్నామని, పౌరులను కాదని సైన్యం వివరణ ఇచ్చింది.
దీని ఫలితంగా 2017 ఆగస్టులో మయన్మార్ లో దాదాపు 700 మంది రోహింజ్యా ముస్లింలు తీవ్ర హింసను ఎదుర్కొన్నారు. దీనిని భరించలేని పరిస్థితుల్లో బంగ్లాదేశ్కు పారిపోయారు. ఆ వలస ఇప్పటికీ కొనసాగుతోంది.
సరిహద్దుల్లో ఉన్న మయన్మార్ రాష్ట్రం రఖైన్ నుంచి ఇప్పటికీ వేలమంది బోర్డర్ దాటి బంగ్లాదేశ్లోకి వస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న నఫ్ నది, కొన్నిసార్లు సముద్ర మార్గాల్లో చిన్న పడవల మీద ప్రయాణిస్తూ, మరి కొందరు అడవుల్లో ప్రమాదకరమైన మార్గాల గుండా ప్రయాణిస్తూ బంగ్లాదేశ్ చేరుకుంటున్నారు. రోహింజ్యాల మీద దాడి ‘జాతి హననం’ అని ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది.
అరకొరగా సాయంతో బతుకు వేదన
రోహింజ్యా శరణార్థులు బంగ్లాదేశ్లో పని లేదా ఉద్యోగం చేసేందుకు స్థానిక చట్టాలు అంగీకరించవు. అంతే కాకుండా వాళ్లు విద్య, వైద్యం కోసం క్యాంపుల్ని వదిలి వెళ్లడానికి అవకాశం లేదు. ఆహారం, దుస్తులు, భవన నిర్మాణ సామగ్రి, వైద్య సేవలు, స్కూళ్లు ఇలా అన్నింటికీ స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే విరాళాల మీదనే శరణార్థులు ఆధారపడాలి. డోనల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత యూఎస్ ఎయిడ్ ద్వారా ఇస్తున్న నిధులను నిలిపేశారు. దీంతో శరణార్థుల పరిస్థితి మరింత క్షీణించింది.
ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రోగ్రామ్లకు అందిస్తున్న నిధులను నిలిపేశారు. 2024లో రోహింజ్యా శరణార్థులకు అందిన ఆర్థిక సాయం 54.5 కోట్ల డాలర్ల (సుమారు రూ. 4650 కోట్లు)లో 30 కోట్ల డాలర్లు( సుమారు రూ. 2580 కోట్లు ) అమెరికా నుంచే వచ్చాయి.
READ ALSO: China tariff : శ్వేతసౌధం చర్యకు దీటుగా డ్రాగన్ స్పందన