జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా యుద్ధం రావచ్చనే సూచనలు రెండు దేశాల వైపు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్, పాక్ సైన్యాలు యుద్ధం వస్తే ఎలా స్పందించాలి అనే దానిపై సమగ్ర వ్యూహాలు రచిస్తున్నాయి. రెండు దేశాల ఆర్మీ అలర్ట్ అయి సరిహద్దుల్లోకి చేరుకుంటోంది. ఆయుధాలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కేంద్రప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాక్తో ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ దేశంలోని ఆయా రాష్ట్రాలకు నరేంద్ర మోదీ సర్కార్ కీలక సూచనలు చేసింది. అన్ని రాష్ట్రాల్లో దేశ భద్రతలో ప్రజలను అలర్ట్ చేసేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది.భారత్- పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ దేశంలో భద్రతా సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతలో పౌరులను భాగస్వామ్యం చేసేందుకు బుధవారం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దేశంలో భద్రతా సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమర్జెన్సీ సమయాల్లో ఎలా స్పందించాలో తెలపాలని పేర్కొంది. శత్రు దేశం దాడి చేస్తే విద్యార్థులు, యువకులు స్వీయరక్షణతో పాటు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని తెలిపింది.
మాక్ డ్రిల్స్
కేంద్ర హోంశాఖ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. భారత్ దాడులకు పాక్ ప్రతిదాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఒకవేళ పాక్ దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై అందర్నీ సన్నద్ధం చేసే కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది. ఎయిర్ రైడ్ వార్నింగ్లకు సంబంధించిన సైరన్లు ఎలా పని చేస్తున్నాయో టెస్ట్ చేయాలని ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో పౌరులకు తెలపాలని సూచించింది.ఇప్పటికే సరిహద్దుల్లో కవ్వింపు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్, భారత్ లో దాడులు చేసే అవకాశాలు ఉన్నాయనే నిఘా వర్గాల హెచ్చరికలతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కీలక సూచనలు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజా ఉద్రిక్తతల వేళ మాక్ డ్రిల్స్తో ప్రజల్లో అవగాహన కల్పించాలని చూస్తోంది. ఒకవేళ వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలి ప్రజల్లో ఆందోళనలు చెలరేగకుండా వారికి ఎలాంటి సూచనలు చేయాలి సైరన్ ఇచ్చి ఎలా అలర్ట్ చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ చేయాలని కేంద్ర హోం శాఖ తెలిపింది.
ఆదేశాలు
1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఇలాంటి సీన్లు చూశారు ఆనాటి తరం. మళ్లీ అవి ఇప్పుడు పునరావృతమవుతున్నాయి.జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సమావేశం తర్వాత కేంద్రం రాష్ట్రాలకు ఈ ఆదేశాలు చేయడం గమనార్హం. గత ఆదివారం నాడు పంజాబ్లోని ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల పాటు బ్లాక్ ఔట్ రిహార్సల్స్ జరిగాయి. దీనిలో భాగంగా రాత్రి 9 నుంచి 9:30 వరకు నివాసాల్లో లైట్లు, వాహనాల లైట్లు ఆపివేసి ఉంచారు.
Read Also :Supreme Court: ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఎందుకంటే?