భారత్, పాక్ల (India, Pakistan) మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఆపాలని కోరారు. అంతేకాదు దాయాదుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాడాని తాను సహాయం చేస్తానని పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ ప్రభావం
పహల్గాం దాడులకు ప్రతీకారంగా పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ బుధవారం ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు దేశాధినేతలు, రాయబారులు స్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్, పాకిస్థాన్లను కోరారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తాజాగా స్పందించారు. ఓవల్ ఆఫీస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, భారత్-పాకిస్థాన్లు ఒకరిపైఒకరు దాడులు చేయడం ఆపాలని కోరారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు ట్రంప్ ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకోవడానికి తాను సహాయం చేస్తానని పేర్కొన్నారు.
రెండు దేశాలతో నాకు మంచి సంబంధాలు
“భారత్, పాకిస్థాన్ల మధ్య పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆ రెండు దేశాల గురించి నాకు చాలా తెలుసు. ఆ రెండు దేశాలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కనుక ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, పరస్పర దాడులు ఆపేయాలని ఆ రెండు దేశాలను కోరుకుంటున్నాను. వారు అనుకుంటే ఇప్పుడే ఆ పని చేసేయగలరు. కానీ ఆ రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. అమెరికాతో భారత్, పాకిస్థాన్లకు మంచి సంబంధాల ఉన్న దృష్ట్యా వారికి సహాయం చేయాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటాను. ఏ సాయమైనా చేస్తాను.”
70 మంది ఉగ్రవాదులు ఖతం!
పహల్గాం ఉగ్రదాడికి బదులుగా పాక్, పీఓకేల్లోని 9 ఉగ్రస్థావరాలపై ఇండయన్ ఆర్మీ దాడులు చేసింది. ఈ ఆపరేషన్లో సుమారు 70 మందికి పైగానే ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం. అయితే భారత్ జరిపిన దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారని, 46 మందికి గాయాలయ్యాయని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ (ISPR) డైరెక్టర్ జనరల్ ప్రకటించడం గమనార్హం. ఇక భారత దాడుల తరువాత సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట పాక్ బలగాలు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడ్డాయి. దీంతో 15 మంది భారత పౌరులు మృతి చెందగా, ఒక జవాను అమరుడయ్యాడు. 43 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. దీనితో రంగంలోనికి దిగిన భారత్ బలగాలు, పాక్ దాడులను తిప్పికొడుతున్నాయి.
Read Also: Operation Sindoor : ఆపరేషన్ సింధూర్ ముగియలేదు ..కేంద్రం ప్రకటన