బంగ్లాదేశ్(Bangladesh) తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్(Muhammad Yunus) పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) తీవ్ర ఆరోపణలు చేశారు. ‘దేశాన్ని ఆయన అమెరికాకు అమ్మేశాడు’ అని హసీనా విమర్శించారు. తమ పార్టీ అవామీ లీగ్పై నిషేధాన్ని రాజ్యాంగ విరుద్ధమని ఆమె ఖండించారు. పార్టీ అధికారిక ఫేస్బుక్(Face Book) ఖాతాలో ఈ మేరకు ఆడియో సందేశం పోస్ట్ చేశారు. గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో మొదలైన యువత ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్(Bharath) కు పారిపోయి వచ్చారు. అనంతరం 2024 ఆగస్టు 7న ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమితులయ్యారు.
డిసెంబరులో సాధారణ ఎన్నికలు నిర్వహించాలని బంగ్లాదేశ్ సైన్యం కోరిన నేపథ్యంలో యూనస్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో యూనస్పై హసీనా ఆరోపణలు గుప్పించారు.

‘ఉన్మాదులు’ చేతిలో పెట్టేశారు..:హసీనా
‘‘అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూనస్.. తన ప్రభుత్వమే ప్రోత్సహించిన వ్యక్తి అయినా, ఇప్పుడాయనే దేశాన్ని ‘ఉన్మాదులు’ చేతిలో పెట్టేశారు.. నా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ సెయింట్ మార్టిన్ ద్వీపం కోసం అమెరికా పెట్టిన డిమాండ్లను తిరస్కరించారు.. అందుకే ఆయన్ను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. నేనూ అధికారంలో ఉండాలన్న ఉద్దేశంతో దేశాన్ని అమ్మేయాలన్న ఆలోచనే చెయ్యలేదు’ అని అన్నారు.
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో షేక్ ముజిబుర్ రెహ్మాన్తో కలిసి ప్రజలు ఎలా గెరిల్లా పోరాటం చేశారో ఆమె గుర్తు చేశారు. ‘నా దేశ భూభాగాన్ని ఒక్క అంగుళమైనా వదులుతానన్న భావన ఏ ఒక్కరికీ ఉండకూడదు.. కానీ దురదృష్టవశాత్తూ, ఇంతటి స్థాయి ప్రేమనూ గౌరవాన్నీ పొందిన వ్యక్తికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?’ అని ప్రశ్నించారు. బంగ్లా విముక్తి యుద్ధంలో షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహ్మాన్ కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను బంగ్లా జాతిపితగా పిలుచుకుంటారు.
బంగ్లాదేశ్ మళ్లీ తీవ్రవాదుల పాలన
‘‘యూనస్ ఉగ్రవాదుల సహాయంతో అధికారాన్ని ఆక్రమించారు. అంతర్జాతీయంగా నిషేధించిన తీవ్రవాద సంస్థలే ఆయనకు బలంగా నిలిచాయి. నా ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజలను వీరి నుంచి రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంది. ఒక్క ఉగ్రదాడి తరువాతే అనేక మందిని అరెస్టు చేశాం. ఇప్పుడు జైళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి… అందరినీ విడుదల చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్లీ తీవ్రవాదుల పాలనలోకి వెళ్ళింది’ అని హసీనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ లేకుండా ఆయన చట్టాలను ఎలా మార్చగలరు?
యూనస్ను ‘మిలిటెంట్ నేత’గా పేర్కొంటూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం చట్టవిరుద్దం.., రాజ్యాంగ వ్యతిరేకం’ అని హసీనా ఆరోపించారు. ‘గొప్పదైన మా బంగ్లా జాతికి ఉన్న రాజ్యాంగం.. అది ఎన్నో ఏళ్ల పోరాటం, విమోచన యుద్ధం ద్వారా లభించింది.. అక్రమంగా అధికారాన్ని ఆక్రమించిన ఈ మిలిటెంట్ నేతకు ఆ రాజ్యాంగాన్ని తాకే హక్కును ఎవరు ఇచ్చారు? ఆయనకు ప్రజల మద్దతు లేదు, రాజ్యాంగపరమైన ఆధారమూ లేదు. ఆయన ఉన్న స్థానమైన ‘చీఫ్ అడ్వైజర్’ అనే పదవికి కూడా ఎలాంటి చట్టపరమైన ప్రాతినిధ్యం లేదు.. అది రాజ్యాంగంలోనే లేదు. అయితే, పార్లమెంట్ లేకుండా ఆయన చట్టాలను ఎలా మార్చగలరు? ఇది పూర్తిగా అక్రమం. అవామీ లీగ్ను నిషేధించారు’ అని హసీనా విరుచుకుపడ్డారు.
Read Also: Pakistan :సైనిక వ్యాపార విస్తరణతో అగమ్యగోచరంగా భవిష్యత్తు