జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన పాశవిక ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఖండించింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న వారిని ఇలాంటి ఘటనలకు జవాబుదారీగా ఉంచాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. ఈ మేరకు 15 దేశాలతో ఉన్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శనివారం ఉదయం ప్రకటన విడుదల చేసింది. కౌన్సిల్లోని సభ్యులు ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిని ప్రకటన ద్వారా తీవ్రంగా ఖండించారు.
భారత ప్రభుత్వానికి తమ ప్రగాఢ సానుభూతి
బాధితుల కుటుంబాలకు, భారత ప్రభుత్వానికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు భద్రతా మండలి సభ్యులు. గాయపడిన వారు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదం అన్ని రూపాల్లో అంతర్జాతీయ శాంతి, భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పుగా ఉందని UNSC సభ్యులు అన్నారు. ఉగ్రవాద చర్యలు నేరపూరితమైనవిగా తెలిపారు. అన్ని దేశాలు సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. అదే సమయంలో చురుగ్గా వ్యవహరించాలని కోరారు.
సంయమనం పాటించాలి!
మరోవైపు, పహల్గాంలో జరిగిన అమానుష ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో 26 మంది అమాయక పర్యటకులు మృతి చెందడం అంతర్జాతీయంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది. పౌరులపై జరిగిన ఈ దాడి మానవతా విలువలను తుంచేస్తుందని ఐరాస స్పష్టం చేసింది. ఈ విషయంపై ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మీడియాతో ఇటీవల మాట్లాడారు. సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పహల్గాం ఘటనను ఎంతో ఆందోళనతో పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఎలాంటి రూపంలోనైనా పూర్తిగా ఖండనీయమని, పౌరులపై దాడిని అస్సలు సహించలేమని తెలిపారు. ఇలాంటి పరిణామాలు దక్షిణాసియాలో శాంతి స్థితిని దెబ్బతీయవచ్చని అన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరుదేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ద్వైపాక్షిక చర్చలే శాశ్వత పరిస్కారం
సమస్యల పరిష్కారం కోసం శాంతియుత చర్చలే మార్గమని, రెండు దేశాలు మాటల ద్వారానే పరిష్కారానికి రాగలరని తాము ఆశిస్తున్నామని స్టీఫెన్ తెలిపారు. యుద్ధం మార్గం కాదని, ద్వైపాక్షిక చర్చలే శాశ్వత పరిష్కారానికి దారి తీస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్ర దాడి.. ఎట్టకేలకు స్పందించిన పాక్ ప్రధాని