పహల్గాంలో తీవ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ కు వరుసగా షాకులిస్తున్న కేంద్రం.. తాజాగా మరో బిగ్ షాక్ ఇచ్చింది. పహల్గాం దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం.. ఈ ఒప్పందం కారణంగా సుదీర్ఘ కాలంగా కశ్మీర్లో పెండింగ్ లో ఉన్న రెండు జల విద్యుత్ ప్రాజెక్టుల్ని తిరిగి ప్రారంభిస్తోంది. అదే జరిగితే సింధు నది ఉపనదులపై ఉన్న ప్రాజెక్టుల నుంచి పాకిస్తాన్ కు నీటి విషయంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు.

సింధు నదీ జలాల ఒప్పందం రద్దు
కాశ్మీర్లోని హిమాలయ పర్వత ప్రాంతంలోని రెండు జలవిద్యుత్ ప్రాజెక్టుల రిజర్వాయర్ హోల్డింగ్ సామర్థ్యాన్ని పెంచే పనిని భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్తో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల సామర్ధ్యం పెంచుకునేందుకు అవకాశం ఏర్పడింది. అదే జరిగితే పాకిస్తాన్ కు నీటి లభ్యత క్రమంగా తగ్గిపోతుందని భావిస్తున్నారు.
వాస్తవానికి 1960 నుండి మూడు యుద్ధాలు జరిగినా, ఎన్నోసార్లు ఉద్రిక్తతలు తలెత్తినా సింధు జలాల ఒప్పందం పరిధిలోకి వచ్చే ఒప్పందాలను ఉల్లంఘించి కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలా రెండు జల విద్యుత్ ప్రాజెక్టుల సామర్ధ్యం పెంచడం ప్రారంభించింది. భారతదేశంలోని అతిపెద్ద జలవిద్యుత్ సంస్థ NHPC లిమిటెడ్ , జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ రిజర్వాయర్లలో పూడిక తొలగింపు పనుల్ని ప్రారంభించాయి. దీంతో పాటు రిజర్వాయర్ల సామర్ధ్యం పెంచే కార్యక్రమం సమాతరంగా చేపట్టబోతున్నారు.
హెచ్చరిస్తున్న పాకిస్తాన్
మరోవైపు భారత్ చేపట్టిన ఈ చర్యల వల్ల పాకిస్తాన్ కు తక్షణం నీటి సరఫరాకు ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే భారత్ తన నీటిపారుదల, జల విద్యుత్తు కోసం ఎక్కువగా నదులపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇతర ప్రాజెక్టుల్లోనూ ఇలాంటి ప్రయత్నాలను ప్రారంభిస్తే పాకిస్తాన్ పై ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సింధు నది ఉపనదుల నీటిని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేసినా అడ్డుకుంటామని పాకిస్తాన్ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read Also:Singapore : సింగపూర్ ప్రధానిగా మళ్లీ లారెన్స్ వాంగ్