జమ్మూ కాశ్మీర్ పహల్గామ్(Pahalgam) ఉగ్రవాదుల నరమేధానికి భారత్.. ప్రతీకారం తీర్చుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్(Pakistan) సంచలన ప్రకటన చేసింది. సైనిక చర్యతో పాటు అంతర్జాతీయ వేదికలపై పాక్ దురాగతాలను భారత్ బట్టబయలు చేస్తోన్న నేపథ్యంలో అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. భారత్(India) తో శాంతి చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్, ఉగ్రవాదం సహా అన్ని అంశాలనూ చర్చల ద్వారా, శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.
వివాదాలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నాము
ఈ విషయాన్ని స్వయానా ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ఉగ్రవాదం, సరిహద్దుల్లో చొరబాట్లు, వాణిజ్యం, ఇండస్ వాటర్ ట్రీటీ.. వంటి ఇతరత్రా అంశాలపై భారత్ తో కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించుకోవాలని భావిస్తోన్నామని, చర్చల ద్వారానే అది సాధ్యపడుతుందని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్ లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద ఏర్పాటైన కార్యక్రమంలో షరీఫ్ పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడి తరువాత భారత్- పాకిస్తాన్ మధ్య తలెత్తిన యుద్ధ వాతావరణాన్ని నియంత్రించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ చూపారని ప్రశంసించారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి సహకరించారని పేర్కొన్నారు. అలాగే.. భారత్- పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు ఏర్పాటు కావడానికి కూడా డొనాల్డ్ ట్రంప్ సహకరించాలని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు.
త్వరలోనే వైట్ హౌస్ ఓ సానుకూల నిర్ణయం
పాక్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ట్రంప్ మరో అడుగు ముందుకేసి, భారత్ తో సమగ్రంగా శాంతి చర్చలు ఏర్పాటు కావడానికి సహకరించాలని షరీఫ్ కోరారు. దీనిపై త్వరలోనే వైట్ హౌస్ ఓ సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. గతంలోనూ శాంతి చర్చల ప్రతిపాదనను తెర మీదికి తీసుకొచ్చారు షెహబాజ్ షరీఫ్. ఇరాన్ పర్యటన సమయంలో ఈ ప్రతిపాదన చేశారు. భారత్ నిజంగా శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటోన్నట్లయితే తమ ప్రతిపాదనలకు అంగీకరించాలని వ్యాఖ్యానించారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, భారత్ వైఖరి ఏమిటనేది ఆ దేశ నాయకత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. సుదీర్ఘకాలంగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమౌతూ వస్తోన్న జమ్మూ కాశ్మీర్ సహా అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అప్పట్లో వెల్లడించారాయన.
Read Also: AI: ఏఐతో పొంచిఉన్న ప్రమాదం..గూగుల్ డీప్మైండ్ సీఈవో