జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ల మధ్య అగ్గిరాజుకుంది. పాక్తో ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ దేశంలోని ఆయా రాష్ట్రాలకు నరేంద్ర మోదీ సర్కార్ కీలక సూచనలు చేసింది. అన్ని రాష్ట్రాల్లో దేశ భద్రతలో భాగంగా, ప్రజలను అలర్ట్ చేసేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. భారత్ దాడి చేస్తుందనే భయంతో వణికిపోతోన్న పాక్ అటు, సరిహద్దుల్లోనూ చొరబాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో భారత్ దాడిని దీటుగా తిప్పికొడతామని పాక్ సైన్యం ప్రకటించింది.ఈ క్రమంలో దాయాది దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా భారత రక్షణ రంగ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లను రంగంలోకి దింపింది. పాక్ హ్యాకర్లు సైబర్ దాడుల మళ్లీ ముమ్మరం చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. అయితే, భారత మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ సంస్థల వెబ్సైట్ను హ్యాక్ చేసినట్టు ‘పాకిస్థాన్ సైబర్ ఫోర్స్’ అనే హ్యాకర్ల గ్రూప్ ప్రకటించింది.
రక్షణ రంగ
ఈ దాడిలో మెస్ , ఎంపీ -ఐడి ఎస్ఏ లలో పని చేస్తున్న రక్షణ సిబ్బంది వ్యక్తిగత సమాచారం, లాగిన్ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్ చేసినట్టు సమాచారం. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (ఏవిఎన్ఎల్) వెబ్సైట్ను కూడా హ్యాక్ చేసి అందులో పాకిస్థాన్ జెండా, అల్ ఖాలిద్ ట్యాంక్ ఫోటోలను ఉంచినట్లు తెలుస్తోంది.ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఏవిఎన్ఎల్ వెబ్సైట్ను తాత్కాలికంగా ఆఫ్లైన్కు తీసుకొచ్చారు. ‘ఈ ఘటనలో నష్టం ఎంత వరకు జరిగిందో తెలుసుకోవడం, సిస్టమ్ సమగ్రతను నిర్ధారించుకోవడం కోసం లోతైన భద్రతా పరిశీలన జరుగుతోంది’ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్, భారత్ల మధ్య ఉద్రిక్తతలపై ఇప్పటికే అమెరికా స్పందించింది. ఇరు దేశాలూ బాధ్యతయుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.పాకిస్థాన్కు చెందిన సైబర్ నేరగాళ్లు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉండటంతో, సంబంధిత భద్రతా సంస్థలు నిశితంగా పర్యవేక్షణ చేపట్టాయి. భవిష్యత్లో సైబర్ ముప్పులను ముందుగానే గుర్తించి అరికట్టడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఉన్నతాధికారి
ఈ నేపథ్యంలో, రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు డిజిటల్ మౌలిక వేదికలను మరింత పటిష్టంగా మార్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ‘సైబర్ దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఆయా సంస్థల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు కొనసాగుతున్నాయి’ అని ఒక ఉన్నతాధికారి తెలిపారు
Read Also: Visa: వీసా లేకుండా హాయిగా ఈ దేశాల్లో పర్యటించవచ్చు