కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ, దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. పాకిస్థాన్ ను విచ్ఛిన్నం చేసి, నాలుగు ప్రాంతాలుగా విభజించాలంటూ ఆయన చేసిన సూచన ప్రకంపనలు సృష్టిస్తోంది.”పాకిస్థాన్ ను విచ్ఛిన్నం చేయడమే మన దీర్ఘకాలిక లక్ష్యం” అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. పాకిస్తాన్లోని బలూచిస్థాన్, సింధ్, పఖ్తూనిస్థాన్ ప్రాంతాలు విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడాలని ఆయన అన్నారు. పాక్ లోని పశ్చిమ పంజాబ్ ప్రాంతాన్ని వ్యంగ్యంగా ‘బకిస్థాన్’ అని సంబోధిస్తూ, దానిని శత్రువుగా చూడాలని అభిప్రాయపడ్డారు.ఈ ట్వీట్ ద్వారా, పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న వేర్పాటువాద ఉద్యమాలకు స్వామి పరోక్షంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బలూచిస్థాన్, సింధ్, పఖ్తూనిస్థాన్ లలో దశాబ్దాలుగా స్వాతంత్ర్య ఆకాంక్షలు, అసంతృప్తి కొనసాగుతున్న నేపథ్యంలో స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బలూచిస్థాన్ ప్రాంతానికి చెందిన బలోచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు పాక్ ప్రభుత్వంతో పోరాడుతున్న విషయం తెలిసిందే.
ఉద్యమం
ఇదే తరహా అభిప్రాయాలను గతంలో ఇతర బీజేపీ నేతలు కూడా వ్యక్తం చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇటీవల మాట్లాడుతూ, బలూచిస్థాన్ స్వాతంత్య్ర ఉద్యమం కారణంగా పాకిస్థాన్ నుంచి విడిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కూడా 2025 నాటికి పాకిస్తాన్ మూడు ముక్కలవుతుందని (బలూచిస్థాన్, పఖ్తూనిస్థాన్, పంజాబ్) అభిప్రాయపడ్డారు. స్వామి తాజా ట్వీట్ ఈ చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.
ముష్కరులు
జమ్ము కశ్మీర్లోని మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు.సైనిక దుస్తుల్లో వచ్చి పర్యటకులను చుట్టుముట్టారు. వారి పేర్లు అడుగుతూ ముఖ్యంగా హిందువులు, పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోగా 20 మంది వరకు గాయపడ్డారు. అయితే ఘటన అనంతరం ముష్కరులు అడవుల్లోకి పారిపోగా విషయం తెలుసుకున్న భారత బలగాలు క్షతగాత్రులకు సాయం చేశారు. ఆపై పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.13 ఏళ్ల తర్వాత కశ్మీర్లో పౌరులపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. మరోవైపు, పాకిస్థాన్ సైతం సరిహద్దుల్లో అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడితో భారత్ తమపై 2019 పుల్వామా ఆత్మాహుతి ఘటన తర్వాత దాడిచేసినట్టు మరోసారి మెరుపు దాడులకు దిగుతుందేమోనని దాయాది భావిస్తోంది.
Read Also: Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి వెలుగులోకి సంచలన నిజాలు!