పాకిస్థాన్లో మండుతున్న ఎండలు: ఏప్రిల్లో ప్రపంచ రికార్డు దాటే ఉష్ణోగ్రతలు
దాయాది దేశం పాకిస్థాన్ ప్రస్తుతం అత్యంత తీవ్రమైన వేడి తీవ్రతను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఇప్పటికే 48 డిగ్రీల సెల్సియస్ను తాకగా, కొన్ని ప్రాంతాల్లో ఇది 50 డిగ్రీల మార్కును దాటి పోయే అవకాశం ఉందని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్థాన్ వాతావరణ శాఖ (పీఎండీ) ఏప్రిల్ 26 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా తీవ్ర వడగాల్పుల పరిస్థితులు నెలకొంటాయని అధికారిక హెచ్చరికలను జారీ చేసింది. గతంలో 2018 ఏప్రిల్లో నవాబ్షా పట్టణంలో నమోదైన 50.2 డిగ్రీల సెల్సియస్ ప్రపంచ రికార్డును ఈ ఏడాది బద్దలు కొట్టే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం మధ్య మరియు దక్షిణ పాకిస్థాన్ ప్రాంతాలు మండుతున్న ఎండల వల్ల ప్రభావితమవుతున్నాయి. ఈసీఎండబ్ల్యూఎఫ్ (ECMWF) వాతావరణ నమూనాల ప్రకారం, బుధ, గురువారాల్లో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెల్సియస్ను చేరే అవకాశముంది. అయితే, గత వారం ఇదే మోడల్ ఉష్ణోగ్రతలను తక్కువగా అంచనా వేసిందని చెబుతున్న నేపథ్యంలో, వాస్తవంగా ఇది 50 డిగ్రీల మార్కును దాటి వెళ్లే ప్రమాదం ఉందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది.
21 దేశాలను కమ్మేస్తున్న భయంకర వేడి ప్రభావం
ఈ తీవ్రమైన వడగాల్పులు కేవలం పాకిస్థాన్కే పరిమితం కావడం లేదు. భారత్, ఇరాన్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, యూఏఈ, ఒమన్, ఖతార్, సుడాన్, దక్షిణ సుడాన్, ఇథియోపియా, చాద్, నైజీరియా, నైగర్, మాలి, సెనెగల్, బుర్కినా ఫాసో వంటి దేశాల్లో కూడా ఈ వారం 43 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి.
ఇది అంతర్జాతీయ స్థాయిలో వాతావరణ మార్పుల తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ప్రజల ఆరోగ్యంపై, వ్యవసాయంపై, నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుండగా, ప్రభుత్వాలు ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకునేలా సూచనలు జారీ చేస్తున్నాయి. బయటకు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు తప్ప మరెవ్వరూ ఇళ్లను వదిలి రావద్దని పీఎండీ సూచిస్తోంది. తగిన శీతలీకరణ చర్యలు, తగిన మోతాదులో నీరు సేవించాల్సిన అవసరం చాలా ఉందని నిపుణులు చెబుతున్నారు.
తూర్పు ఆసియాకూ వ్యాపిస్తున్న వేడి ప్రభావం
ఈ వడగాల్పుల ప్రభావం కేవలం మధ్య ప్రాచ్య దేశాలకే పరిమితం కాకుండా తూర్పు ఆసియా దిశగా కదులుతోంది. వడగాలులు తూర్పుగా చైనా వైపుగా వెళ్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాదు, మధ్య ఆసియా దేశాలైన తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్లలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ను దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది సమకాలీన వాతావరణ పరిస్థితుల తీవ్రతను మరింత స్పష్టంగా వెల్లడిస్తుంది.
గ్లోబల్ వార్మింగ్ ప్రభావం & భవిష్యత్తుపై ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ఇటువంటి తీవ్ర వడగాల్పులు ఇప్పుడు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఎల్ నినో ప్రభావం తగ్గినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. సాధారణంగా చల్లదనాన్ని కలిగించే లా నినా పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వాతావరణాన్ని అసాధారణంగా వేడిగా మార్చేస్తోంది. ఇది మానవాళికి ఒక గంభీర హెచ్చరికగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాల నియంత్రణ వంటి అంశాల్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
read also: India: ఇప్పటివరకు భారత్ను వీడిన 786 పాక్ పౌరులు